ఎదులాపురం : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ నెల 19న గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన మాదిరిగానే ప్రభుత్వ శాఖల సమన్వయం, ఉత్సవ కమిటీ సహకారంతో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలన్నారు. గత ఏడాదిన్నర కాలంగా కొవిడ్తో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ప్రసుత్తం పండుగలను కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్ ,అగ్నిమాపక, రోడ్లు భవనాలు, మున్సిపల్, అబ్కారీ, వైద్యం, ఆయా శాఖల పరంగా ఏర్పాట్లను నిర్వహించాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగ కుండా ఉత్సవ కమిటీ గణేశ్ మండళ్లకు ముందస్తు సూచనలు అందించాలన్నారు.
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సంవత్సరం గతంలో కంటే ఎక్కువ మండళ్లలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్టించారని వెల్లడించారు. రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగకుండా సహకరించాలన్నారు. మద్యం రవాణా కాకుండా అబ్కారీ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు. విగ్రహ నిమజ్జనం సందర్భంగా పెన్ గంగా వద్ద చిన్న పిల్లలను , వృద్ధులను అనుమతించబోమని తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను నియమించామని వివరించారు. నైపుణ్యం గల డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు. ఈ సంవత్సరం డీజేలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని, డీజేలు ఏర్పాటు చేస్తే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సీసీ కెమెరాలు , మొబైల్ టీమ్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
అంతకు ముందు ఆయా శాఖలు చేపట్టే కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ శాఖల వారీగా విధులను నిర్వహించాలన్నారు. అబ్కారీ ఎస్ఐ మాట్లాడుతూ.. 18వ తేదీ సాయంత్రం నుంచి 20 వ తేదీ వరకు ఉదయం 11 వరకు బార్లు, వైస్ షాపులు మూసి ఉంచుతున్నామని వెల్లడించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్టీవో జాడి రాజేశ్వర్, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.