ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం సీసీఐ సాధన కమిటీ చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటించారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడగా, ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ జీ నగేశ్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులంతా నినాదాలు చేశారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం దిగివచ్చేంత వరకూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 4 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలంటూ జిల్లాలో ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలంటూ శుక్రవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆదిలాబాద్ బంద్ విజయవంతమైంది. ఈ బంద్కు ప్రజలతో పాటు అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభించింది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడగా, ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జీపు, ఆటోలు సైతం నడవకపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆందోళనకారులు ఉదయం ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ సోయం బాపురావ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పట్టణంలో మోటర్ సైకిళ్లపై తిరుగుతూ బంద్ను పర్యవేక్షించారు.ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ జీ నగేశ్ సాధన కమిటీ సభ్యులతో కలిసి డిపో ఎదుట బైఠాయించారు. పట్టణంలో ఎమ్మెల్యే జోగు రామన్న, సభ్యులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సీసీఐ పునః ప్రారంభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా కేంద్రం స్పందించడం లేదంటూ సాధన కమిటీ సభ్యులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. సీసీఐని ప్రారంభించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. బంద్లో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో కన్వీనర్ విజ్జిగిరి నారాయణ, టీఆర్ఎస్ నాయకులు యూనుస్ అక్బానీ, సాజీదొద్దీన్, సాయిని రవి, ఉష్కం రఘుపతి, ఖయ్యూం, నాయకులు లంకా రాఘవులు, బండి దత్తాత్తి పాల్గొన్నారు.
సీసీఐ సాధన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి సిమెంటు పరిశ్రమను సాధిస్తాం. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా ఆందోళనలు చేపడుతాం. కేంద్ర ప్రభుత్వం సీసీఐని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, తాము ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సీసీఐలో భూములు కోల్పోయిన వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేసిన ఎంపీ సోయం బాపురావ్, మాజీ కేంద్ర మంత్రి హన్స్రాజ్ గంగారాం సీసీఐని ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పుడెందుకు స్పందించడం లేదో చెప్పాలి.
– జోగు రామన్న, ఆదిలాబాద్, ఎమ్మెల్యే
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలని పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసినా ఫలితం లేదు. సీసీఐని ప్రారంభిస్తే రాయితీలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించినా స్పందన లేదు. పరిశ్రమ ప్రారంభానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. 51-49 వాటా విధానం అమలు చేయాలి. లేని పక్షంలో సీసీఐని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. ప్రస్తుతం సిమెంట్కు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో సీసీఐని ప్రారంభిస్తే మంచి లాభాలు గడించడంతో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తుంది.
– జీ నగేశ్, మాజీ ఎంపీ, ఆదిలాబాద్
సీసీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి. లాభాల్లో ఉన్న సీసీఐని మూసివేయడంతో భూములు ఇచ్చిన రైతులు ఉపాధి కోల్పోయారు. గతంలో దేశంలో 11 సిమెంట్ పరిశ్రమల్లో సీసీఐ ఒకటి. ప్రైవేటీ కరణలో భాగంగా పరిశ్రమను మూసివేశారు. సీసీఐని తిరిగి ప్రారంభిస్తే భూ నిర్వాసితులతో పాటు యువతకు ఉపాధి దొరుకుతుంది. ఆదిలాబాద్ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది.
– బండి దత్తాత్రి, సాధన కమిటీ నాయకుడు