ఆదిలాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది. మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ప్రకటించిన.. పీఏసీఎస్ నిర్వాహకులు గన్నీ సంచులు లేకపోవడంతో కొనుగోలు చేయడం లేదు. పంటను ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందుదామనుకున్న రైతులకు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు తప్పడం లేదు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మండుటెండలో ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 18 వేల ఎకరాల్లో మక్క సాగు చేయగా.. 5.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం అధికారులు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మద్దతు ధర రూ.2400 ఉండగా.. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.1800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటులో అమ్మి నష్టపోతామని పంటను విక్రయించడం లేదు. ప్రభుత్వం పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించకుండా.. కొనుగోళ్లను ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.
నేను యాసంగిలో మూడెకరాల్లో మక్క వేశా. 70 క్వింటాళ్ల మక్కలను మూడు రోజుల కిందట ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. గన్నీ సంచులు లేవని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పంటను తీసుకోవడం లేదు. సంచులు వస్తాయంటూ ఆలస్యం చేస్తున్నారు. మండుటెండతో మార్కెట్ యార్డులో పంటకు కాపాలగా ఉంటున్నా. ఎండలు భరించలేక నీరసం వస్తుంది. చాలా మంది రైతులు వడదెబ్బ తాకుతుందని భయపడుతున్నారు. మక్కలు ఎప్పుడు కొంటారని అధికారులను అడిగితే సంచుల లేవు అని సమాధానం ఇస్తున్నారు. ప్రైవేటులో అమ్ముకుందామనుకుంటే తక్కువ ధర ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మక్క కొనుగోళ్లను వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– అమృతరావు, రైతు, చింతగూడ, ఆదిలాబాద్ రూరల్