మంచిర్యాల, మే 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే. ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకయ్యింది? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా ఉన్న కరెంట్.. ఇవాళ ఎందుకు పోతున్నది. సీఎంఆర్ఎఫ్ ఎందుకు వస్తలేదు. రైతుబంధు ఎందుకు ఆగింది. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్లు ఎందుకు వస్తలేవు. ఇవన్ని కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులను కాంగ్రెసోళ్లు నిలిపివేస్తున్నరు. మంచినీళ్లు రాక.. సాగునీళ్లు రాక.. కష్టపడి పండిన పంటను కొనేటోళ్లు లేక రైతు గోసపడుతున్నడు.
ఐదు నెలల్లోనే రాష్ట్రంలో రాక్షస పాలన చూసినం.. ఇవన్నీ మారాలంటే.. సంక్షేమ పథకాలు సాగాలంటే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందంటూ బీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలే.. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల కేసీఆర్ తెచ్చిన జిల్లా అని, ఎన్నో దశాబ్దాల నుంచి మన కల అని.. దానిని వదిలేసి మళ్ల ఆదిలాబాద్ దారి పట్టాలా? అంటూ ప్రశ్నించారు.
మంచిర్యాల జిల్లా ఉండాలనేటోళ్లు బీఆర్ఎస్కు ఓటు వేయండి. మంచిర్యాల జిల్లా పోయినా పర్లేదు అనేవాళ్లు బీఆర్ఎస్ను ఓడగొట్టి.. కాంగ్రెస్ను గెలిపియ్యండి.. ఆ పుణ్యం కట్టుకోండన్నారు. కొట్లాడుదామా మంచిర్యాల కోసం.. యుద్ధం చేద్దామా.. అని కేసీఆర్ అడిగ్గా… కొట్లాడుదాం, యుద్ధం చేద్దామంటూ జనం స్పందించారు. ఆ యుద్ధం ఎట్లాగూ చేద్దామని, ఇప్పుడు జరిగే బ్యాలెట్ యుద్ధంలోనే మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలని, మంచిర్యాల గుండెచీల్చి ఈశ్వర్ను గెలిపించాలని కేసీఆర్ కోరారు.
ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ చేసిన మంచి పనులన్నీ ఆగిపోవాలనే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మంచిర్యాల ప్రజల కోసం తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్. మొండి గోడలతోని మన కండ్ల ముందు కనపడతా ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఈ బిల్డింగ్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపేసింది. ఏ కారణం చేత ఆపేసిందో చెప్పాలన్నారు. ఇలా చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆపేస్తామంటున్నారంటూ మండిపడ్డారు.
వీటన్నింటి మీద నిలదీస్తుంటే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడల వేసుకుంటా.. నీ లాగుల తొండలు సొర్రకొడుతా.. నిన్ను జైళ్ల వేస్తా.. అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. జైళ్లకు కేసీఆర్ బయపడుతడా.. నేను జైళ్లకు బయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా.. అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. నా కండ్ల ముందే తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే నా ప్రాణాలు బలిపెట్టయినా పోరాడుతా తప్ప.. మౌనం పాటించే ప్రశ్నే లేదంటూ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు 4.50 లక్షల ఎకరాలకు పోడు భూములు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. వాళ్లకు రైతుబంధు ఇవ్వడంతోపాటు రైతుబీమా కూడా చేశామన్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా గిరిజనులకు ఇవ్వలేదన్నారు. ఈ రకంగా ఈ ఒకవర్గం ప్రజలనే కాదు.. అటు గిరిజనులను ఇటు దళితులను, ముస్లిం మైనార్టీలను అందరినీ ఇబ్బందులు పెడుతుందన్నారు.
నేను ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా పంపించానని, మరి ఈసారి తోఫా వచ్చిందా? ఇఫ్తార్ విందులు జరిగినయా? అని కేసీఆర్ ఆడగ్గా.. రాలేదంటూ జనం చెప్పారు. దీంతో కేసీఆర్ ఎలా వస్తాయి రావు. వాళ్లు ఎవర్వినీ గౌరవించరు. ముస్లిం మైనార్టీలను, హిందువులను ఎవ్వరిని పట్టించుకోరు. లంబాడీ, గిరిజనులకు ఇవ్వాల్సింది ఇవ్వరు. రాష్ట్రంలో ఇంత రాక్షస పాలన సాగుతుందంటూ ధ్వజమెత్తారు.
గోదావరి నదిని నరేంద్రమోదీ మళ్లీ ఎత్తుకుపోయి అన్యాయం చేస్తా అంటున్నాడని, మరి గోదావరిని ఎత్తుకపోతా అంటే ఊకుందామా? అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి కుయ్ లేదు.. కుక్కు లేదని, ఏం మాట్లాడటం లేదని మండిపడ్డారు. కృష్ణానది తీసుకపోయి ఆల్రెడీ అప్పగించారని, ఇవాళ గోదావరి తీసుకుపోయి తమిళనాడు ఇస్తామంటే నోరు తెరవడం లేదన్నారు. మరి కృష్ణా, గోదావరి పోతే మనల్ని ఎవరు కాపాడాలే.. ఏ విధంగా కాపాడాలో చెప్పాలన్నారు. అందుకే పార్లమెంట్లో ఈ రోజు బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నదుల నీళ్లలో మన హక్కులు కాపాడాలన్నా.. సింగరేణి ప్రైవేటు పరం కావొద్దన్నా.. యథావిధిగా తెలంగాణ సంక్షేమ పథకాలు జరగాలన్నా.. తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు. ఇక ఆ బీజేపీకి ఓటు వేసినా.. గోదావరిలో పడేసినా ఒకటే అన్నారు.
“పాత ఆదిలాబాద్, కొత్త మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిలబడి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ప్రభుత్వం ఏం చెబుతున్నది. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నడు. పాత ఆదిలాబాద్ జిల్లాను గిరిజన ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల కోసం మనం మూడు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. అవే ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఇవాళ ఏం అంటున్నడు ఈ ముఖ్యమంత్రి. నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా.. ఆసిఫాబాద్ జిల్లా.. నిర్మల్ జిల్లాలను తీసేస్తా అంటున్నడు. ఇవాళ ఈ సమావేశంలో ఉండి, టీవీల్లో నా మాట వింటున్న మంచిర్యాల ప్రజలను నేను ఒక్కటే అడుగుతున్నా.. మంచిర్యాల జిల్లా ఉండాల్నా..? పోవాల్నా..?” అంటూ ప్రశ్నించారు. దీనికి జనం జిల్లా ఉండాలంటూ ప్రతిస్పందన వచ్చింది. మొత్తం జిల్లా ప్రజల మాట ఇదేనా అని కేసీఆర్ అడగ్గా.. అవునంటూ దిక్కులు పెక్కటిల్లేలా జనం ముక్తకంఠంతో నినదించారు.
కొప్పుల ఈశ్వర్ మీ బిడ్డ. 26 ఏండ్లు కార్మికుడిగా పనిచేసినోడు. ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడుతడు. నేను నిన్న గోదావరిఖనిలోనే చెప్పిన. ఇవాళ మళ్లీ చెప్తున్నా. ముఖ్యమంత్రి పోయి దావోస్లో, స్విట్జర్లాండ్లో మాట ముచ్చట చేసుకుని అగ్రిమెంట్ చేసిండు. ఆ రోజు నరేంద్రమోదీ నా మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఆస్ట్రేలియా బొగ్గు కొనాలే.. అదానీ బొగ్గు కొనాలే అంటే ఆ రోజు నేను ఒప్పుకోలే. కానీ.. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వెళ్లి అదానీని ఆహ్వానించిండు. సింగరేణిని కంప్లీట్ ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తా ఉన్నడు. సింగరేణి తెలంగాణ కొంగుబంగారం. మరి సింగరేణిపోతే ఏ విధంగా ఉంటాయో మన బతుకులు ఓసారి ఆలోచన చేయాలే.
మంచిర్యాలలో కేసీఆర్ రోడ్ షో సందర్భంగా ఐబీ చౌరస్తాలో టపాసులు కాల్చారు. కేసీఆర్ బస్సుపైకి వస్తున్న సందర్భంగా పెట్టిన షార్ట్స్ చాలా సేపు వరకు పేలాయి. కేసీఆర్ స్పీచ్ స్టార్ట్ చేశాక కూడా అవి పేలుతూనే ఉన్నాయి. కాసేపు వెయిట్ చేసి ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్ టపాసులు ఎంత సేపటికీ ఆగకపోవడంతో ఎవడయ్యా సుమన్. పటాకులు పెట్టినోడు మనోడేనా. కాంగ్రెసోడా.. అంటూ చమత్కరించారు. ఇలా తన ప్రసంగం సాగుతున్నంత సేపు వచ్చిన జనాలను ప్రశ్నలు అడుగుతూ.. నవ్వుతూ.. నవ్విస్తూ కేసీఆర్ మాట్లాడిన తీరు జనాలను ఆకట్టుకున్నది.
ఇప్పటికే సమాచారం వచ్చింది. బంఫర్ మెజార్టీతో కొప్పుల ఈశ్వర్ గెలుస్తున్నడు. నేను ఈ రోజు గెస్ట్హౌస్లో అడిగినప్పుడు పోటీ ఎవ్వలి మధ్యలో ఉందంటే ఒక ఆగర్భ శ్రీమంతుడికి.. ఒక భూగర్భ కార్మికుడికి మధ్యే ఉందని చెప్పారు. నిజంగానే అటువైపు ఒక ఆగర్భ శ్రీమంతుడు.. ఇటువైపు 26 ఏండ్లు తట్ట, లైట్ పెట్టుకుని బొగ్గు మోసిన భూగర్భ కార్మికుడు. మరి కార్మికుడు గెలవాల్నా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాల్నా? మీరే నిర్ణయించాలి. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. బీజేపీ పార్టీతో మనకేమీ ఒరిగేది లేదు. ఒక బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష. అన్ని సర్వేలు చెప్తున్నయ్.. పెద్దపల్లి నియోజకవర్గంలో ఈశ్వర్ గెలిచేపోయినారని చెప్తున్నయ్. ఇంత మండుటెండల్లో 45, 46 డిగ్రీల ఎండలో ఈ చౌరస్తా ఈనిండా తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
– మంచిర్యాల రోడ్ షోలో కేసీఆర్
మంచిర్యాలటౌన్, మే 4 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. జన ప్రభంజనాన్ని తలపించింది. గోదావరిఖని నుంచి మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన బస్సుయాత్రకు ఇందారం, మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, సింగరేణి కార్మికులు,
ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఐబీ చౌరస్తాలోని మూడు ప్రధాన రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి. లక్ష్మీటాకీసు చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా, లక్షెట్టిపేట రోడ్, చెన్నూరు రోడ్లన్నీ గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి కొత్త శోభను సంతరించుకున్నాయి. బాస్ మాట్లాడుతున్నంత సేపు ఆయా వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలు రద్దు కావద్దన్నా.. సింగరేణిని బతికించుకోవాలన్నా.. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రసంగం గులాబీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది.