మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 19 : పెద్దపల్లి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం మంచిర్యాలలోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్దపల్లికి బయలుదేరి వెళ్లారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించారని, ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
కేసీఆర్ పాలన ఏ రకంగా ఉందో, రేవంత్రెడ్డి పాలన ఏ రకంగా ఉందో ప్రజలు బేరీజు వేసుకొని ఓటేయాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబితేనే.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని తెలిపారు. ఇక బీజేపీకి ఓటువేస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, అప్పుడు మనం ఏదైనా ప్రశ్నిస్తే జైళ్లలో పెడుతారని చెప్పుకొచ్చారు. కొప్పుల ఈశ్వర్కు ఇక్కడి సమస్యలు తెలుసని, కార్మిక నాయకునిగా, సౌమ్యుడిగా ఎంతో పేరున్న ఆయనను గెలిపించుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజిత్రావు, గాదెసత్యం, తోట తిరుపతి, శ్రీపతి వాసు, శెట్టి శ్రీనివాస్, రేషవేణి రవికుమార్, మల్లేశ్, కొట్టె మల్లయ్య పాల్గొన్నారు.