“రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమా? ఇదేనా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు దుర్మార్గపు పాలన.. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కోలేకే కేంద్రం కనుసన్నల్లో ‘బండి’ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ కుట్ర పూరితమైన చర్యలకు తెరతీసింది. తొమ్మిదేండ్లుగా లేని ప్రశ్నపత్రాల లీకేజీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నదో ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎన్నికలు సమీపిస్తుండడంతో కమలనాథులు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.” అని ప్రజాప్రతినిధులు బండిపై మండిపడ్డారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవారం సంజయ్పై ఆగ్రహజ్వాల వెల్లువెత్తింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ‘బండి ఖబడ్డార్.. బీజేపీ డౌన్ డౌన్.. సంజయ్ను బర్తరఫ్, అరెస్టు చేయాలని’ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఠాణాలో పదో తరగతి విద్యార్థులు.. ఆదిలాబాద్ జిల్లా మావల, సిరికొండ, తలమడుగు, జైనథ్ ఠాణాల్లో తల్లిదండ్రులు సంజయ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్/నిర్మల్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పథకం ప్రకారమే ప్రశ్నా పత్రాలను లీక్ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. చెన్నూర్ పట్టణంలోని బస్టాం డ్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, ఎంపీ పీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి ఉన్నారు. మంచిర్యాలలోని తన నివాసంలో ఎమ్మెల్యే దివాకర్రావు బండి సంజయ్ తీరుపై మండిపడ్డారు.
అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్వంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. మందమర్రి పట్టణం, కోటపల్లి మండలం నాగంపేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వీవీ ప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొండ్ర జగ్గాగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి,ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు బండి సంజయ్ తీరుపై మండిపడ్డారు. స్వలాభంకోసం విద్యార్థులు, నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడడం దారుణమన్నారు. ఖానాపూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపరు లీకేజీలోనూ బండి సంజయ్ పాత్ర ఉందని ఆరోపించారు.
కాగజ్నగర్ : బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నాపత్రాల లీకేజీ పేరిట పదో తరగతి విద్యార్థులను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధికోసం విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేస్తున్నారని, వారు అఘాయిత్యాలకు పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సంజయ్ను బాధ్యుడిగా చేస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైనథ్ పోలీస్ స్టేషన్లో ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, సిరికొండ పోలీస్స్టేషన్లో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బత్తుల అశోక్, తలమడుగు పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు మగ్గిడి ప్రకాశ్, మందమర్రి పోలీస్స్టేషన్లో పదో తరగతి విద్యార్థులు ఐలవేని రామ్తేజ, బైరి తరుణ్, కోటపల్లి పోలీస్ స్టేషన్లో మల్లంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఇప్ప సాయివరుణ్, గోమాస భగవాన్, చెన్నూర్ పోలీస్స్టేషన్లో మరో ఇద్దరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీ కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్లోనే నడుస్తున్నదనే అనుమానాలు కలుగుతున్నాయి. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. సీఎం కేసీఆర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో నాటకాలు ఆడుతున్నారు.
– అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
కేంద్రంలోని బీజేపీ నాయకత్వం సూచనల మేరకే సంజయ్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కమలనాథుల నాటకాల ను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
– బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 5 : టెన్త్ పేపర్ లీకేజీ దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పదో తరగతి పశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై బుధవారం స్థానిక శివాజీ చౌక్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. మంత్రి అల్లోల మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుందన్న అనుమానాలున్నాయన్నారు.
తెలంగాణపై పగబట్టిన కేంద్ర సర్కారు బదనాం చేసే కుట్రలకు తెరలేపుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, కౌన్సిలర్లు, నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.