ఆదిలాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) ః పేద విద్యార్థుల చదువులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించింది. గురుకుల పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సాహం అందించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలు ఉండగా.. వీటిలో 3,320 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో ఐదు బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను అప్గ్రేడ్ చేసి జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయగా.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా అవకాశం కలిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో విద్యారంగం అస్తవ్యస్తంగా ఉండేది. ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో సరైన వసతుల లేక విద్యార్థులు చదువులు ముందుకు సాగేవి కావు. పేద విద్యార్థులకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న సౌకర్యాలు సరిగా లేక వారి విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. దీంతో ప్రతిభ గల విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించింది. అన్ని వర్గాలకు చెందిన పిల్లలు ఉచితంగా విద్యను అభ్యసించేలా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి కార్పొరేట్ చదువులను అందిస్తున్నది. విద్యార్థులు చదువులు మధ్యలో ఆగిపోకుండా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు బీసీ రెసిడెన్షియల్ జ్యోతిబా పూలే విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. వీటిల్లో 3,320 మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్నారు. ఆదిలాబాద్ బాలికల మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయంలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉండగా 640 మంది విద్యార్థినులు.. బాలుర స్కూల్, జూనియర్ కళాశాలలో 640 మంది, జైనథ్ బాలుర స్కూల్, కళాశాలలో 640 మంది, తాంసి మండలం ఈదుల సవర్గాం స్కూల్, జూనియర్ కళాశాలలో 640 మంది, జైనథ్ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల విద్యాలయంలో 540 మంది, ఇచ్చోడ మండలం నర్సాపూర్ స్కూల్, కళాశాలలో 540 మంది, బేల బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో 320 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఐదు విద్యాలయాల్లో ఇంటర్ విద్య
ఆదిలాబాద్ జిల్లాలో ఐదు బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ బాలికలు, జైనథ్లో బాలురు, బాలికల మహాత్మ జ్యోతి బాపూలే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్, జైనథ్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 130 మంది, రెండో సంవత్సరంలో 144 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జైనథ్ బాలుర జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 92 మంది, రెండో సంవత్సరంలో 52 మంది విద్యార్థులు ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో తాంసి మండలం ఈదుల సవర్గాం, ఇచ్చోడ మండలం నర్సాపూర్లో మహాత్మా జ్యోతి బా పూలే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈదుల సవర్గాం జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 52 మంది, రెండో సంవత్సరంలో 67 మంది విద్యను అభ్యసిస్తున్నారు. నర్సాపూర్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 35 మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విద్యార్థులు చదువుల్లో ప్రతిభ కనపరుస్తూ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకుంటున్నారు.