కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, రైతాంగం రంది లేకుండా సాగు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేళ్లలో వినూత్న పథకాలతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టారు. రైతుబంధు ఇచ్చి పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10 వేల ఇస్తున్నారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొంటున్నారు. రైతుబీమాతో ఆయా కుటుంబాలకు రూ. 5 లక్షలు అందించి అండగా నిలుస్తున్నారు. అన్నింటికీ మించి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి వేలాది ఎకరాలకు సాగు నీరందిస్తున్నడు. భూ వివాదాలను పరిష్కరించి దశాబ్దాల కల నెరవేర్చారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంటరుణాలను మాఫీ చేయడంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేశారు.
గత ప్రభుత్వాలు వ్యసాయానికి కరెంట్ ఇవ్వాలనే ఆలోచనే చేయలేదు. రోజులో ఆరు గంటలు ఇచ్చే కరెంట్ ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. తెలంగాణ రైతులకు ఆ కష్టాలు ఉండొద్దని సీఎం కేసీఆర్ భావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పగటి పూట 7 గంటల విద్యుత్ను కచ్చితంగా ఇప్పించారు. ఆ తర్వాత కొద్ది నెలలకు 9 గంటల పాటు సరఫరా చేయించారు. 2018 జనవరి 1 నుంచి ఏకంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను నిరంతరం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 6,666 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 0.65 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించేవారు. ప్రస్తుతం 0.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ను రైతులు వినియోగిస్తున్నారు. అంటే నిరంతర విద్యుత్ సరఫరాతో 0.10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. రైతులు పరిస్థితిని బట్టి సాగు చేస్తున్న పంటలకు ఎంతమేరకు అవసరమైతే నీరు అంతవరకు మాత్రమే పెట్టేందుకు విద్యుత్ మోటర్లను వినియోగిస్తున్నారు. దీనికోసం జిల్లాలో కొత్తగా 33/77 కేవీ సబ్స్టేషన్లు 6 ఏర్పాటు చేశారు.
రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం దాదాపు రూ. 15 కోట్లతో గోదాముల నిర్మాణం చేపట్టింది. జిల్లా కేంద్రంలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండు గోదాములు, వాంకిడిలోని బెండారలో ఒకటి, రెబ్బెన మండలం రాంపూర్లో మరొకటి, కెరమెరి మండలంలో ఒకటి నిర్మించింది. ఒక్కోదానికి రూ. 3 కోట్లు వెచ్చించింది. ఇవేగాకుండా జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో 30 మెట్రిక్ టన్నుల గోదాంతో పాటు 3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నాలుగు చిన్నగోదాములను ప్రభుత్వం నిర్మించింది.
సమైక్య రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసినా పంట పెట్టుబడికి కష్టమయ్యేది. అప్పోసప్పో చేసి సాగు చేస్తే పంట చేతికి వచ్చాక అప్పు ఇచ్చిన సేటుకో, వడ్డీ వ్యాపారికో అమ్మక తప్పేది కాదు. తీసుకున్న అప్పు, వడ్డీ కలిపితే దమ్మిడి కూడా మిగిలేదు కాదు. అనేక కుటుంబాలు రోడ్డున పడేవి. కానీ స్వరాష్ట్రంలో 2018లో జిల్లా వ్యాప్తంగా 93,813 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 125 కోట్ల 13 లక్షల 24 వేల 360 సాయంతో ప్రారంభమైన ఈ పథకం.. ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలకు చేరి జిల్లాలో 1,14,973 మందికి అందుతున్నది. రైతుబంధు సాయం రూ. 191.09 కోట్లకు పెరిగింది.
ప్రమాదవశాత్తు మరణించే రైతుల కుటుంబాలు రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మరో అద్భుతమైన పథకం రైతుబీమా. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందుతుంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన వెంటనే ఎవరితో సంబంధం లేకుండా డబ్బులు ఖాతాలో పడిపోతాయి. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న రైతు మరణంతో రోడ్డున పడే స్థితిలో ఉన్న ఎన్నో కుటుంబాలకు రైతుబీమా ఆసరాగా నిలుస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 547 మంది రైతులు రైతుబీమా పొందారు. రూ. 27.35 కోట్లు ప్రభుత్వం అందించింది.
నాకు 3.5 ఎకరాల భూమి ఉన్నది. యేటా రెండుసార్లు రైతుబంధు పైసలు బ్యాంకులో పడుతున్నయ్. ఇది వరకు సావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లం. పంట చేతికిరాంగనే వడ్డీతో కలిపి కట్టేటోళ్లం. ఆరు నెలల పాటు కాయకష్టం చేస్తే చివరకు చిల్లిగవ్వ కూడా మిగిలేది కాదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ పుణ్యమాని పెట్టుబడికి రందిలేకుంటైంది. నీళ్లకు కూడా తిప్పల లేదు. ఉచితంగా 24 గంటల కరెంట్ కూడా ఇస్తున్నరు. తెలంగాణ రాకముందు ఎవుసమంటేనే భయమేసేది. కొందరైతే ఊర్లు ఇడిసిపెట్టి పోయిన్రు. కానీ.. ఇప్పుడు సంబురంగా సాగు చేస్కుంటున్నం.
– గుర్నులే పోశయ్య, రైతు, కుశ్నపల్లి
జిల్లాలో వివాదాస్పదంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు అందించి దశాబ్దాల కల నెరవేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. 2018లో భూ ప్రక్షాళన ద్వారా జిల్లాలో 91,812 పట్టాలను ఎలాంటి చిక్కులు లేకుండా రైతులకు పంపిణీ చేశారు. ఇటీవల 11,753 మంది గిరిజన రైతులకు 47,130 ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందించారు. ఈ భూములకు సంబంధించి రైతుబంధు కూడా పంపిణీ చేశారు.