ఆసిఫాబాద్/మంచిర్యాల అర్బన్/చెన్నూర్, మార్చి 6 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై మాట మార్చడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నిరసనలు చేపట్టింది.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ముందు శ్రేణులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ‘420’ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మంచిర్యాల పట్టణంలోని ఆర్అండ్బీ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చడం సరైంది కాదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని, కాంగ్రెస్ రాగానే నీరు, కరంటు, ఎరువులు అందడం లేదని ఆరోపించారు. చెన్నూర్లో మున్సిపల్ చైర్పర్సన్ అర్చన గిల్డా, చెన్నూర్ ఎంపీపీ మంత్రి బాపు, శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.