ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రచారం అలుపెరగకుండా సాగుతున్నది. అభ్యర్థులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, విఠల్రెడ్డి, జాదవ్ అనిల్, జాన్సన్నాయక్, కోవలక్ష్మితో పాటు శ్రేణులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఊరూరా సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇంటింటికీ వెళ్లి అభివృద్ధితో పాటు మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తుండగా, అనూహ్య స్పందన వస్తున్నది. పదేళ్లలో సాధించిన ప్రగతిని చూసి మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగేదేముండదని, ఆ పార్టీల మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇక ఆయా పార్టీల నుంచి వలసలు కొనసాగుతుండగా, రోజు రోజుకూ కారుకు మద్దతు పెరుగుతున్నది.