ఎదులాపురం, మే 14 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హసద్, సాహద్ నాయకులతో కలిసి ఆదివారం 55 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన పేద ప్రజలే ఉన్నారన్నారు. వారి కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలే బీఆర్ఎస్కు బలం.. బలగం అని గుర్తుచేశారు. గడిచిన 68 యేండ్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేసింది, బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఆసరా పింఛన్, కేసీఆర్, న్యూట్రీషన్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. గర్భవతి నుంచి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అయి పాప, బాబు పుట్టిన ఆరునెలల వరకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నది కారు గుర్తు సర్కారు అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యేను పార్టీ నాయుకులు, వార్డు కౌన్సిలర్లు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, వార్డు కౌన్సిలర్లు బండ శ్రీను, బండారి సతీశ్, నాయకులు సాజీద్ ఉద్దీన్, జహూర్, ఎజాజ్, మెట్టు ప్రహ్లాద్, కాలనీవాసులు దశరథ్, నిఖిల్, ఉమ, రఫీక్, గణేశ్, నదీం, విజయస్వామి, సులోచన, ఫరీన్, షబీనా, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
పట్టణ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.25 కోట్ల ప్రత్యేక నిధులను ఖర్చు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కుమ్రం భీమ్ చౌరస్తా సుందరీకరణలో భాగంగా కొనసాగుతున్న పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అన్ని వార్డుల్లో సుందరీకరణ కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు దాసరి రమేశ్, పండ్ల శ్రీను, రాజన్న, సాజీదుద్దీన్ తదితరులున్నారు.
మాదిగ సంక్షేమ సంఘ స్థల భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు సంఘ సభ్యులతో కలిసి కార్యక్రమ వాల్పోస్టర్లు విడుదల చేశారు. పట్టణంలోని 72వ సర్వే నంబర్లో ఉన్న సంఘ స్థల భూమిపూజ కార్యక్రమాన్ని ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వాల్పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్దసంఖ్యంలో హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు చందాల రాజన్న కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి నాగన్న, గౌరవాధ్యక్షుడు అలాల్ అజయ్, నాయకులు రాందాస్, ఏవన్, ప్రభాకర్, సంజయ్, నవీన్, లక్ష్మణ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.