నిర్మల్ చైన్గేట్, ఆగస్టు 1 : తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు. పుట్టిన వెంటనే తల్లిపాలు పడితే బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లీబిడ్డల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని తల్లులకు వివరించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఏటా ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు.
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలు తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి. తల్లిపాల ఆవశ్యకతపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. అంగన్వాడీ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు పూర్తి అవగాహన కల్పించాలని సూపర్వైజర్లు, టీచర్లకు సూచించడం జరిగింది. తల్లిపాల వారోత్సవాలు విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-కే విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి, నిర్మల్
నిర్మల్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు: 816
మినీ అంగన్వాడీ కేంద్రాలు: 110
0 నుంచి ఐదేళ్లలోపు
చిన్నారులు- 60,330
గర్భిణులు-5994
బాలింతలు-5568