నిర్మల్ టౌన్, జూలై 23: తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులు పోటీపడి సీట్లు సాధిస్తున్నారు. సీట్లు సాధించుకున్న వారందరూ గురుకులాల్లో చదువుకునేందుకు సంసిద్ధం కావడంతో చేరిన విద్యార్థుల్లో డ్రాపౌట్స్ గణనీయంగా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాలు ఐదు, బీసీ గురుకులాలు ఏడు, మైనార్టీ గురుకులాలు ఆరు ఉన్నాయి. ఐదో తరగతి ప్రవేశాల కోసం ప్రభుత్వం సెట్ పరీక్షను నిర్వహించగా అన్ని గురుకులాల్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి ప్రవేశాలు కల్పించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలైన లెఫ్ట్ పోచంపాడ్, నచ్చన్ ఎల్లపూర్, బాసర, జాం, బాలుర విభాగంలో 80 సీట్ల చొప్పున 5వ తరగతిలో ప్రవేశాలు కల్పించగా బాలుర విభాగంలో ముథోల్లో 80 చొప్పున విద్యార్థులకు అవకాశం కల్పించారు. బీసీ గురుకులాలు నిర్మల్, ఖానాపూర్, భైంసా, ముథోల్లో ఏడు ఉండగా 80 చొప్పున ప్రవేశాలు కల్పించారు. వీరందరికీ ప్రభుత్వం ఐదు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. తమ పిల్లలను నాలుగో తరగతి నుంచే ప్రత్యేక శిక్షణ ఇప్పించడంతో గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధిస్తున్నారు. గతంలో గురుకులాల్లో చేరిన పిల్లల్లో ఒక్కొక్క పాఠశాల నుంచి తరగతికి కనీసం పది మంది చేరేవారు కాదు. కానీ ఇప్పుడు 80 మందికి సీట్లు కేటాయిస్తే అందులో మొత్తం విద్యార్థులు గురుకులాల్లో చేరడంతో డ్రాపౌట్స్ లేకుండా పోయింది.
పైరవీలకు ఆస్కారం లేదు…
గురుకుల విద్యకు ప్రాధాన్యత నిర్మల్ జిల్లాలోని గురుకులాల్లో మెరుగైన విద్యను బోధిస్తుండడంతో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఆడ పిల్లలను గురుకులాల్లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశయంతో విద్యార్థినులు చేరారు. అయితే కొందరు విద్యార్థులు ఆరోగ్య సమస్యలు, దూర ప్రాంతాల్లో గురుకులాల్లో సీట్లు రావడంతో అక్కడ అడ్మిషన్లు తీసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో సీట్లు ఖాళీగా ఉంటే పరస్పరం బదిలీలకు అవకాశం ఏర్పడేది. దీనికి తోడు చేరని పిల్లల స్థానంలో కొత్త వారిని సిఫార్సు మేరకు భర్తీ చేసేవారు కానీ ఈ ఏడాది పూర్తిగా సీట్ల భర్తీ చేపట్టారు. సెట్ పరీక్షల ద్వారా వచ్చిన మార్కుల ఆధారంగానే ఆన్లైన్ సీట్ల కేటాయింపు నిర్వహిస్తున్నారు. ఏ పాఠశాలలో సీటు వస్తే ఆ పాఠశాలలో చేర్పించాలని, ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని గురుకుల విద్యాలయాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కొన్ని గురుకులాల్లో సీట్లు మిగిలిన వాటి రిపోర్టును హైదరాబాద్ పరిధిలో గల ఆ సంస్థ కార్యదర్శులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మెరిట్ ఆధారంగా మరికొందరిని ఎంపిక చేసి ఇప్పటికే రెండు విడుతలుగా సీట్ల కేటాయింపు పూర్తయినట్లు ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. రెండు, మూడేళ్ల క్రితం గురుకుల విద్యాలయాల్లో డ్రాపౌట్స్ 20 నుంచి 30 శాతం ఉండగా ఇప్పుడు ఒక్క శాతం కూడా లేదు.
చదువు బాగా చెబుతున్నారు
గురుకుల పాఠశాలలో సీటు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా అమ్మనాన్నలు వ్యవసాయం చేస్తారు. నాలుగో తరగతిలో కష్టపడి చదివి గురుకులంలో సీటు సాధించాను. ఇక్కడ మంచిగా సార్లు చదువు చెబుతున్నారు. మూడు పూటలా అన్నం, టిఫిన్ అందిస్తున్నారు. ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, స్కూల్ డ్రెస్ ఇచ్చారు. సంతోషంగా ఉంది. ఐదు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో మంచి మార్కులు తెచ్చుకుంటా.
-అక్షయ, 5వ తరగతి
ఇంటికి పోవాలనిపిస్తలేదు..
నేను కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ భయమన్పించింది. టీచర్లు ప్రతి రోజూ మాతో మాట్లాడారు. నాకు మొదట్లో ఇంటికి పోవాలని అన్పించింది. మేడమ్ బాగా చదువుకొని మంచిగా ఉండాలని చెప్పింది. ఇప్పుడు తరగతిలో దోస్తులతో కలిసి ఉంటూ ప్రతి రోజూ మా పనులు మేము చేసుకుంటూ బాగా చదువుకుంటున్నాం. ఇప్పుడు ఇంటికి పోవాలనిపిస్తలేదు. ఇక్కడ టైంకు అన్నం, టిఫిన్, పాలు అన్ని ఇస్తున్నారు. ప్రతి రోజూ ఆరోగ్యం కూడా చూస్తున్నారు.
-అనూజ, 5వ తరగతి