లోకేశ్వరం, అక్టోబర్, 17: బీఆర్ఎస్ను ఆదరించి మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని పుస్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సయ్యతో పాటు ఆయా కుల సంఘాల, పార్టీల నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 59 ఏండ్లలోపు వారు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమాను అందించేందుకు కేసీఆర్ ప్రకటించినట్లు తెలిపారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా రూ. 3 వేల పింఛన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పింఛన్లు కూడా పెరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన వాటిని వివరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నవంబర్ 3 న కేసీఆర్ భైంసా పట్టణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, పార్టీ మండల కన్వీనర్ శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, భైంసా ఏఎంసీ వైస్ చైర్మన్ జేకే పటేల్, నాయకులు గంగయ్య, దత్తు పటేల్, బండి ప్రశాంత్, కపిల్ దిగంబర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్వరంలో పార్టీ కార్యాలయం ప్రారంభం
లోకేశ్వరంలో బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. నగర్, పిప్రి, లోకేశ్వరం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.