మంచిర్యాల అర్బన్/ఆసిఫాబాద్, సెప్టెంబర్ 24 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో మహిళా, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ భారతీహోళికేరి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి ఆడిపాడారు. ఎమ్మెల్యే దివాకర్రావు సైతం కాలు కదిపారు. వారు మాట్లాడుతూ పూలనే పేర్చి దేవతగా పూజించే పండుగ బతుకమ్మ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో 2.50 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ చాహత్బాజ్బాయితో కలిసి బతుకమ్మ ఆడారు. డీడబ్ల్యూవోలు చిన్నయ్య, సావిత్రి, సఖీ కేంద్రం నిర్వాహకురాలు సౌజన్య , ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విద్యార్థులు పాల్గొన్నారు.