ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. పూటగడవని పరిస్థితులను చూశారు. దీంతో వందలాది కిలోమీటర్లు నుంచి వారు తెలంగాణకు వచ్చారు. వలసవచ్చిన వారిని తల్లి లాంటి మన పల్లెలు ఆదరించి అక్కున చేర్చుకున్నాయి. దీంతో వారికి ఉపాధి చూపిస్తున్నాయి. రైతులకు అవసరమైన పనిముట్లు మరమ్మతు, తయారు చేస్తూ బతుకుతున్నారు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కూలీలు. భైంసా మండలంలో పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
– భైంసాటౌన్, జనవరి 25
మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరందుకు న్నాయి. సాగు పనుల్లో బిజీగా మారిన రైతులు పనిముట్ల మరమ్మతు చేయిస్తున్నారు. అవసరమైన వారు కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ర్టాల నుంచి వలస వచ్చిన పలు కుటుంబాలు వ్యవసాయ పనిముట్లు మరమ్మతు చేస్తూ ఉపాధి పొందుతున్నాయి. రైతుల పంట పొలాలకు అవసరమ య్యే కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లను వీరు ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ప్రతి సంవ త్సరం వానకాలం, యాసంగి పంట లకు అవసరమయ్యే వ్యవసాయ పనిముట్లను వీరు మరమ్మతు, తయారు చేస్తుంటారు.
మన ప్రాంత రైతులు సైతం వీరి వద్దే వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేస్తుంటారు. దీంతో నిత్యం రూ. 2 వేల వరకు సంపాదిస్తున్నట్లు మధ్య ప్రదేశ్ వాసులు, రాజస్థానీలు తెలిపారు. మండలంలోని భైంసా శివారు ప్రాంతాలు, దేగాం, వానల్పాడ్ గ్రామాల్లో వ్యవసాయ పనిముట్లను విక్రయిస్తున్నారు. వీరు తయారు చేసే పనిముట్లంటే రైతులు ఫిదా అవుతున్నారు. అయితే ఈ కుటుంబాల్లోని చిన్నారులు కూడా పెద్ద వారితో పాటే పనుల్లో నిమగ్నమవుతున్నారు.
రోజుకు రూ. 2 వేలు సంపాదిస్తున్నా..
ప్రతి సంవత్సరం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తుంటాం. వ్యవ సాయ పనిముట్లను తయా రు చేస్తూ విక్రయిస్తాం. మా వద్దే రైతులు పరికరాలు కొనుగోలు చేస్తుంటారు. దీంతో రోజుకు సుమారు రూ. 2 వేల వరకు సంపాది స్తున్నాం. సంతోషంగా ఉంది. మా రాష్ట్రంలో ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడ్డాం. గత్యంతరం లేక ఇక్కడికి వచ్చాం. ఇక్కడి ప్రజలు, రైతులు మమ్మల్ని ఆదరిస్తున్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు చూస్తుంటే మేము కూడా తెలంగాణలో పుడితే ఎంత బాగుండో అనిపిస్తున్నది.
– అజ్జు, మధ్య ప్రదేశ్