మంచిర్యాల, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర సర్కారు చేపట్టిన అభివృద్ధిని చూసి అండగా నిలవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నస్పూర్లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ పనులను శుక్రవారం ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి పరిశీలించారు. అనంత రం కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, ట్రెయినీ కలెక్టర్ గౌతమితో పాటు జిల్లా ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మా ర్చి 15వ తేదీకల్లా మంచిర్యాల సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్లాలని, సోమ, మంగళవారం ఇక్కడే ఉండి పనుల పురోగతిని సమీక్షించాలని అధికారులకు సూచించారు. మ్యాన్ పవర్ పెంచుకొని అన్ని పనులు ఒకేసారి పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి విప్ బాల్క సుమన్ విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లో.. . కలెక్టరేట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని ఫ్ల్లోర్లలో సివిల్ వర్క్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వైరింగ్, కిటికీలు, ఫాల్సీలింగ్, ఫ్లోరింగ్ పనులు కొంత వరకు చేయాల్సి ఉంది. పైప్లైన్, ప్రహరీ, ఎంట్రెన్స్ ఆర్చ్, నేషనల్ హైవే నుంచి ఇక్కడి వరకు రోడ్డు నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది.
సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకుందాం
ప్రభుత్వ ఫలాలు సాధారణ ప్రజానీకానికి వేగంగా అందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తున్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఒకే దగ్గర ఉండాలనే ఆలోచనతో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తాం. అలాగే అంతర్గాం నుంచి మంచిర్యాల వరకు గోదావరిపై బిడ్జి నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు ఇచ్చారు. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. లక్ష ఎకరాలకు నీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం, ఇప్పటికే పూర్తయిన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపనలు చేయిస్తాం. త్వరలోనే సీఎం జిల్లా పర్యాటనకు వస్తారు. సీఎం వస్తే ఇంకొన్ని నిధులు వస్తాయి. అపరిష్కృత సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం పెరుగుతుంది. అందుకే సీఎం పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం.
గత పాలకులు చేసిందేమీ లేదు..
గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలించినా, ఢిల్లీలో బీజేపీ పాలించినా మంచిర్యాల ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వారి పాలనలో ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వ పరమైన సేవలు, అభివృద్ధి ఫలాలు అందుకోవడంతో చాలా వెనుకబడ్డారు. ఆ నాటి ప్రభుత్వాలు, నాయకుల దయాదాక్షిణ్యాలకు నోచుకొని మంచిర్యాల ప్రాంతం సీఎం కేసీఆర్ ఆలోచనతో జిల్లాగా అవతరించింది. ప్రతి గ్రామం, మున్సిపాలిటీ, మండలంలో అద్భుతమైన ప్రగతి కనిపిస్తున్నది. పంటల దిగుబడి, రహదారులు-బిడ్జిల నిర్మాణం, వివిధ శాఖల ఆదాయం ఇలా ఏ రంగంలో చూసినా జిల్లా దూసుకుపోతున్నది. వైద్య, విద్య రంగాలు, గ్రామ సీమల అభివృద్ధిలో జిల్లా ముందున్నది. వీటన్నింటినీ సుసాధ్యం చేసి చూపించిన సీఎం కేసీఆర్ను జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి. గతంలో కేంద్రం, రాష్ట్రంలో మంత్రులుగా ఉండి ఏం చేయని వాళ్లంతా ఇప్పుడు జిల్లా పర్యటనలకు వస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రజలు దీనిని గమనించాలి. జిల్లాలో చిల్లర రాజకీయాలు వద్దు.. అభివృద్ధి రాజకీయాలు ముద్దు అనే నినాదంతో ముందుకు సాగుదాం. గడిచిన తొమ్మిదేళ్లలో మేం చేపట్టిన అభివృద్ధిని చూడాలి. రాబోయే రోజుల్లో మరింత సేవ చేసేందుకు మాకు అండగా నిలవాలి.
కేసీఆర్ నాయకత్వంలోనే అద్భుతమైన ప్రగతి..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. తలసరి ఆదాయంలో, పంటల దిగుబడిలో, తలసరి విద్యుత్ వినియోగంలో, ఐటీ ఎగుమతుల్లో ఇలా ఏ రంగంలో చూసినా దేశంలోనే తెలంగాణ ఇవాళ నంబర్-1 స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పల్లెలకు అవార్డులు ఇస్తే టాప్-20లో 19 గ్రామాలు మన రాష్ర్టానివే ఉన్నాయి. స్వచ్ఛసర్వేక్షణ్లో పట్టణాలకు అవార్డులు ఇస్తే అందులో మన పట్టణాలే ఎక్కువగా ఉన్నాయి. అవార్డుల పరంగా చూసుకున్నా, పనితీరు, వృద్ధి రేటు పరంగా చూసుకున్నా అద్భుతమైన ప్రగతితో తెలంగాణ ముందుకు సాగుతుంది. కేసీఆర్ కార్యదక్షత, నిబద్ధత, చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైంది. రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ఎలా కష్టపడుతున్నారో ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము కూడా జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్నాం. జిల్లా ప్రజానీకం దీన్ని గుర్తించి ఎప్పుడూ మా వెంటే ఉండాలి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో జిల్లాలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు ప్రగతి కోసం, అభివృద్ధి కోసం, ప్రజలు- సమాజం కోసం పని చేస్తున్నరో వారినే గుర్తించాలని కోరుతున్నాం.
సింగరేణిని బొందపెట్టే కుట్ర..
కేంద్రంలోని ప్రభుత్వం సింగరేణి కార్మికులు, ప్రజల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నది. స్వయంగా ప్రధాన మంత్రి రామగుండం వచ్చి మేము సింగరేణిని ప్రైవేటుపరం చేయమని చెప్పిన 10 రోజుల్లోనే బెంగళూరులో కేకే-6, శ్రావణపల్లి బొగ్గుబ్లాక్లను వేలానికి పెట్టారు. ఓ వైపు రామగుండానికి వచ్చి మేం సింగరేణిని ప్రైవేటీకరించం అని చెబుతరు. మరోవైపు జిల్లాకు చెందిన రెండు బొగ్గుబావులను వేలానికి పెడుతరు. మేం అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. అయినా మన బొగ్గుబావులను మనకు ఇవ్వకుండా వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారు. బొగ్గుబ్లాక్లు కేటాయించకుండా సింగరేణిని సిక్ యూనిట్గా చేసి దాన్ని ప్రధాని మిత్రుడైన అదానీకి కట్టబెట్టాలని కేంద్రం కుట్రలు చేస్తున్నది. ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. కేంద్రం చేస్తున్న కుట్రను తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలి. భూపాలపల్లిలో జరిగిన మీటింగ్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిపై కుట్ర పన్నుతున్న బీజేపీని బొంద పెట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులంతా ఏకమై పోరాటం చేయాలి. సంస్థ లాభాల్లో 30 శాతం వాటా ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. గత ప్రభుత్వాలు డిపెండెంట్ ఉద్యోగాలను తీసేస్తే, దాన్ని పునరుద్ధరించి 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చర్రిత సీఎం కేసీఆర్దైతే.. సింగరేణిని బొంద పెట్టాలని చూస్తున్న చరిత్ర ప్రధాని మోదీది. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు గమనిస్తూ సింగరేణి కార్మికులు, ప్రజలు తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా కోసం పని చేసే నాయకుల పక్షాన ఉండాలని విజ్ఙప్తి చేస్తున్నా. అంతకుముందు ఎంపీ వెంకటేశ్నేత, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి సస్పూర్లోని జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఇంటింటికీ తాగునీరు అందాలి..
చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తాగు నీరు అందించాలని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్లో శుక్రవారం చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, 102 పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలోని 64 వార్డుల వారీగా మిషన్ భగీరథ, గ్రిడ్ పనులపై సమీక్షించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కాంట్రాక్టర్లు, ఏజెన్సీ అధికారులను హెచ్చరించారు. అవసరమైతే పనిచేయని కాంట్రాక్టర్లను తొలగించి కొత్తవారికి ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దృష్టికి తీసుకువస్తే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, సీఈ అండ్ ఎస్ఈ జ్ఞాన్కుమార్, ఈఈ(ఆర్డబ్ల్యూఎస్) అంజన్రావు, ఈఈ గ్రిడ్ మధుసూదన్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు..
జిల్లా పర్యటనలో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలోని సీసీ రోడ్లు, మెటల్, బీటీ రోడ్లు, బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు మన ఊరు-మన బడిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలను విప్ ప్రారంభించారు. మంద్రమర్రి మండలం ఆదిల్పేటలో రూ.2 కోట్లతో 42 సీసీ, మెటల్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లోనూ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అద్భుతంగా తీర్చిదిద్దిన కోటపల్లి మండలం శెట్పల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చెన్నూరు పట్టణం పద్మానగర్లో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం చెన్నూరు పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.