చెన్నూర్, మార్చి 24 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ అన్నారు. చెన్నూర్లోని ఎంఆర్ఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాధించిన అభివృద్ధి అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉందని, కావున మనం ప్రజల్లోనే ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సమన్వయంతో సుమారుగా 2 వేల నుంచి 3 వేల మంది ప్రజలను సమీకరించుకొని ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బాల్క సుమన్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమమే మన రాజకీయం
: ప్రభుత్వ విప్ బాల్క సుమన్
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ, మన రాజకీయమని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఇతర పార్టీల వారు కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేస్తుంటారని, మనం మాత్రం సమాజ అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాలు చేస్తున్నామని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్లలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం పురోగభివృద్ధిలో పయణిస్తుందన్నారు. ఎంతో సంపద ఉన్నా, దేశంలో సమగ్ర అభివృద్ధి , సం క్షేమం సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఆ విర్భవించిందని చెప్పారు. మోదీ సీబీఐ, ఈడీలతో దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తుందని, వారు ఎన్ని కేసులు పెట్టినా బెదరం అని అన్నారు. గత నెలలో మహారాష్ట్రలో కేసీఆర్ ఒక సమావేశం పెట్టగానే మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తున్నట్లు ప్రకటించిందని, ఇది బీఆర్ఎస్ పార్టీ విజ యం అని గుర్తు చేశారు. దేశంలోని ఇతర రా ష్ర్టా లు, కేసీఆర్ పాలనను కోరుకుంటున్నాయన్నారు.
సచ్చేదాక ఇక్కడే ఉంటా..
చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఎటు పాలుపోని ప్రతిపక్షాల వారు నన్ను ఇక్కడ పోటీ చేయడని అబద్దపు ప్రచారాన్ని చేస్తున్నారని, ఐతే సచ్చేదాక ఇక్కడే ఉంటానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తన తండ్రి ఆస్తికలను కాళేశ్వరం గోదావరిలో కలిపానని, నా అస్తికలను కూడా ఇక్కడే కలుపుతారని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని సిరిసిల్ల, సిద్దిపేటకు దీటుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పంపిన ఆత్మీయ సందేషాన్ని చదివి వినిపించారు.
కేసీఆర్ సీఎం కావడం మీ అదృష్టం : దీపక్ దాదా ఆత్రం, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ సీఎం కావడం ఇక్కడి ప్రజల అదృష్టమని మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం అన్నారు. పక్కనే ఉన్న మా రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశానని, మా ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు కానరాలేదన్నారు. మహారాష్ట్రలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, మీకు మా ప్రజలతో బంధుత్వాలు ఉన్నాయని మీరు అక్కడికి వచ్చినప్పుడు మా పరిస్థితులలో చూడవచ్చునని ఆయన పేర్కోన్నారు. కేసీఆర్ వైపు దేశ ప్రజలు చూస్తున్నారని, దేశ్కి నేత అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పట్టుదల గల నాయకుడు కేసీఆర్ : మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్
కేసీఆర్ ఏదైన తలిస్తే సాధించి తీరుతాడని, పట్టుదల గల నాయకుడు అని మాజీ ఎమ్మెల్సీ పురా ణం సతీశ్ కుమార్ అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడే ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం జైపూర్ మండలానికి చెందిన పలువురు నాయకులు విప్ బాల్క సుమన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర రెడ్డి, వైస్ చైర్మన్ భైస ప్రభాకర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, రైతుబంధు మండల కన్వీనర్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
242 ఇండ్ల పట్టాల పంపిణీ
రామకిష్ణాపూర్ మార్చి 24 : రామకృష్ణాపూర్ (క్యాతన్పల్లి) మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌక్లో 242 ఇండ్ల పట్టాలను విప్ బాల్క సుమన్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడుతలో 1032, రెండో విడుతలో 367, మూడో విడుతలో 356, నాలుగో విడుతలో 222, ఐదో విడుతలో 242, మొత్తం 2,219 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇండ్ల పట్టాల కోసం డీడీలు కట్టాల్సిన వారు 522 మంది ఉన్నారని, రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు 486 మంది ఉన్నారని, అంతేగాకుండా 100 గజాల లోపు భూమి కలిగి ఎలాంటి రుసుం చెల్లించకుండానే 322 మందికి ఇండ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. 1,280 మంది దరఖాస్తులు రిజెక్టు అయ్యాయని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 76 జీవో ప్రకారం ఏప్రిల్, 1 నుంచి జూన్ 30 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సింగరేణి క్వారర్ల మధ్యలో నిర్మించుకున్న ఇండ్ల కూడ ప్రత్యేక అనుమతులు తీసుకొని ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యా సాగర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
గాంధారి వనాన్ని అద్భుతంగా రూపొందించాలి
రామకృష్ణాపూర్ మార్చి 24 : గాంధారి వనాన్ని అద్భుతంగా రూపొందించాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. క్యాతన్పల్లి పంచాయతీలోని గాంధారి వనాన్ని శుక్రవారం సందర్శించారు. అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడారు. సందర్శలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం ఏ ర్పాటు చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమం లో ఓఎస్డీ డీఎఫ్వో కృష్ణ, డీఎఫ్వో ఆశిష్ సింగ్, ఎప్డీవో వినయ్ సాహు, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, ఏఈ అచ్యుత్ పాల్గొన్నారు.
చెక్కుల అందజేత
చెన్నూర్ టౌన్, మార్చి 24 : స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 369 మంది ఆడబిడ్డలకు రూ.3,69,92,862 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం పంపిణీ చేశారు. అలాగే 57 మంది లబ్ధిదారులకు రూ.26,45,800 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ బీమా చెక్కును కూడా బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ని యోజకవర్గంతో పాటు పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. మూడో సారి కూడా కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. చెన్నూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, రైతుబంధు సమితి నాయకుడు తిప్పని లిం గయ్య, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాదీక్ అలీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.