ఎదులాపురం : గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా కమిటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి తాసీల్దార్లు, అటవీ అధికారులు, వీఆర్ఏలతో అటవీ హక్కుల కమిటీల ఏర్పాటు, తదితర అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పోడు భూములపై ప్రభుత్వ నిర్ణయం ,చట్ట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు అటవీ భూముల హక్కులను కల్పించేందుకు నిబంధనలు మేరకు ఫారెస్ట్ రైట్స్ కమిటీలను గ్రామస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు.
ఆ కమిటీలు గ్రామాలలోని ప్రజలకు అటవీ హక్కులపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అర్హత గలవారికి భూముల యాజమాన్య హక్కు చెందేలా సాగు చేస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం , పూర్వాపరాలు, పత్రాలను పరిశీలించి డివిజనల్ స్థాయి కమిటీకి పంపించడం చేయాలని ఆదేశించారు. తద్వారా డివిజనల్ స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా స్థాయి కమిటీకి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. తుది నిర్ణయం జిల్లా స్థాయి కమిటీకి మాత్రమే ఉంటుందన్నారు.