కాగజ్నగర్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం ఆటోవాలాలను ఆదుకోవాలని ఆ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని ఆటో ఓనర్స్, డ్రైవర్లు ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీబస్ సౌకర్యం కల్పించడం వల్ల ఆటోలకు గిరాకీ కావడం లేదని, కిస్తీలు కట్టడం ఇబ్బంది అవుతుందని, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆటో లోకల్ చార్జి రూ.50 నుంచి రూ. 60కు పెంచినట్లు స్పష్టం చేశారు. ఆటోల బంద్ నిర్వహించడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో ఆటో ఓనర్స్, డ్రైవర్లు పాల్గొన్నారు.