చెన్నూర్/చింతలమానేపల్లి/దహెగాం, ఫిబ్రవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో వీధిన పడ్డామని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో శుక్రవారం ఆటోలు బంద్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించినప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని, గిరాకీలు లేక ఫైనాన్స్లు కట్టలేక పోతున్నామని, కుటుంబాలను పోషిసంచుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లు, తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేశారు. ఆటో యూనియన్ మండలాధ్యక్షుడు షేక్ దస్తగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు రియాజ్, మొర్లె బాపురావ్, నాగేశ్, తిరుపతి, మీసాల తిరుపతి, సల్మాన్, సంతోష్, వెంకటేశ్, రమేశ్ పాల్గొన్నారు. దహెగాంలో ఆటో డ్రైవర్లు బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు శ్రీకాంత్, శంకర్, లక్ష్మణ్, రవి, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.