ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 14 : ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి ముఖ్య పర్యవేక్షకులు, లైసన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సెంటర్లో 4 బయోమెట్రిక్ కౌంటర్లు ఏర్పాటు చేశామని, అభ్యర్థుల బయోమెట్రిక్ ప్రక్రియను ఉదయం 10.15 గంటల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్య పర్యవేక్షకులు గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రశ్న పత్రాలు, వోఎంఆర్ షీట్లను సీసీ టీవీ నిఘాలో తెరవాలని ఆదేశించారు. ఈ నెల 15న ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలని, ఆయా మండలాల తహసీల్దార్లు పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని, దివ్యాంగులైన అభ్యర్థులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తహసీల్దార్లు, పరీక్షల కో ఆర్డినేటర్ శ్రీధర్ సుమన్, ముఖ్య పర్యవేక్షకులు, లైసన్ అధికారులు పాల్గ్గొన్నారు.