భైంసాటౌన్, డిసెంబర్ 26 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్యవారధులు ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీలు అయ్యేలా చూడడం, పిల్లలకు టీకాలు వేయించడం.. తద్వారా మాతా శిశు మరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులో వీరు అందించిన సేవలు అమోఘం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దగ్గు, జ్వరం, జలుబు తదితర చిన్నపాటి వ్యాధులకు మందులు అందజేస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ రోగాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ వరకు ప్రతినెలా వారికి సూచనలు చేస్తూ సాధారణ ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సర్కారు వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య రెండింతలు పెరిగాయని చెప్పవచ్చు.
పల్లెలు, తండాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆశవర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేగాకుండా గ్రామాల్లో 18 ఏళ్ల నుంచి వివాహం జరిగిన వెంటనే ఆ గ్రామ అంగన్వాడీ కేంద్రాల్లో వివాహం నమోదు తేదీని ధ్రువీకరించేలా చర్యలు చేపడుతున్నారు. మహిళలు గర్భం దాల్చినట్టు సూచనలు కనిపించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తున్నారు. గర్భిణిగా ధ్రువీకరణ అయిన వెంటనే 12 వారాలకు చెందిన ఎంసీపీ కార్డు అందజేస్తున్నారు. అనంతరం టీటీ ఇంజక్షన్ ఇప్పించి అదే రోజున కేసీఆర్ కిట్ కోసం ఆన్లైన్లో పేరు నమోదు చేయిస్తారు. మొదటి నెల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వివిధ పరీక్షలు చేయించడం, కాల్షియం, ఐరన్ మాత్రలు అందిస్తున్నారు. మొదటి నెల నుంచి తొమ్మిది నెలల వరకు చుక్కలతో కూడిన బొమ్మను నింపేలా కార్డును గర్భిణీకి అందజేసి నిత్యం మాత్రలు వేసుకుంటూ, చుక్కలు కలపాలని అవగాహన కల్పిస్తున్నారు. దీంతో తల్లి కడుపులో బిడ్డ ఎదుగుదల కనిపించేలా చివరి వరకు బొమ్మ తయారు అవుతుంది. ఇక మూడో నెల నుంచి గర్భిణీ ఇంటికి నిత్యం వెళ్లి సాధారణ ప్రసవం జరిగేందుకు దోహదపడే సూచనలు, యోగా , ఆసనాలు, చిట్కాలను వివరిస్తున్నారు. మూడో నెలలోనే కేసీఆర్ కిట్లో భాగంగా రూ. 3 వేల నగదును గర్భిణీ బ్యాంకు ఖాతాలో జమ చేయిస్తున్నారు. గర్భం దాల్చిన నెల నుంచే అంగన్వాడీలో పేరు నమోదు చేయిస్తున్నారు.
ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకునేలా కృషి చేస్తున్నారు. 7,8,9 నెలల్లో గర్భిణులను 102 అమ్మఒడి ప్రభుత్వ వాహనంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా దవాఖాన లేదా మాతాశిశు దవాఖానాలకు తీసుకెళ్లి గైనకాలజిస్టులతో దగ్గరుండి పరీక్షలు చేయిస్తున్నారు. టిఫా స్కానింగ్ చేయించి తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలియజేస్తున్నారు. 9 నెలలు నిండగా (ఎల్ఎంపీఈడీ) పుస్తకంలో నమోదు చేయిస్తున్నారు. తొమ్మిదో నెల మొదటి వారంలోనే గర్భిణీ డెలివరీ తేదిని వారి కుటుంబ సభ్యులకు వివరిస్తారు. అక్కడి నుంచి ప్రతి రోజూ గర్భిణీ ఇంటి మనిషిగా నిత్యంఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. నొప్పులు వచ్చిన వెంటనే 108 వాహనంలో మాతాశిశు ప్రభుత్వ ఏరియా దవాఖానలకు తీసుకెళ్తున్నారు. అంతేగాకుండా దవాఖానకు తీసుకెళ్లిన గర్భిణీ డెలివరీ అయ్యాక బీపీ హెచ్చు తగ్గులను పరిశీలించి, పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తారు.
అక్కడే ఉండి తల్లీబిడ్డల సంరక్షణ చర్యల్లో భాగంగా పుట్టిన బిడ్డ రంగు, బాలింతకు బ్లడ్ బ్లీడింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతారు. డెలివరీ అయిన తల్లులను మూడు రోజులకు అమ్మఒడి వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకుంటారు. డెలివరీ అయిన మహిళను 3,4,7,14,21 , 28, 42 రోజుల్లో వారి ఇంటికి వెళ్లి తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. పుట్టిన బిడ్డకు 16 నెలలు వచ్చాక (డీపీటీ) బూస్టర్ ఇంజక్షన్తో పాటు చుక్కల మందు వేస్తారు. బిడ్డకు ధనుర్వాతం ,మెదడువాపు, తెల్లమచ్చలు, వంటివి రాకుండా నివారణ చర్యలు చేపడుతారు. బిడ్డ సంరక్షణలో భాగంగా చిన్నప్పటి హెపటైటిప్(బీ) చుక్కల మందును కామెర్ల వ్యాధి నివారణ కోసం వేయిస్తారు. ఓపీవీ, ఐపీవీ వేయించి ఓరల్, వాయిల్ పోలియో నివారణ చర్యలు వివరిస్తారు