డిజిటల్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గించేందుకు ‘ఏఐ’
స్కిల్ సెట్లతో శక్తివంతం చేసే లక్ష్యంగా ముందుకు..
ఈ నెలాఖరులోగా దరఖాస్తులకు ఆహ్వానం
మంచిర్యాల అర్బన్, జూలై 7 : దేశంలోని యువతలో డిజిటల్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, సమగ్ర పద్ధతిలో సంబంధిత కృత్రిమ మేధస్సు స్కిల్ సెట్తో వారిని కలుపుకొని శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ), భారత ప్రభుత్వం, ఇంటెల్ ఇండియా సంయుక్తంగా యువ ఆవిష్కర్తల్లో కృత్రిమ మేధస్సు (యంగ్ ఇన్నోవేటర్స్లో బిల్డింగ్ ఏఐ రెడీనెస్) రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పాన్ ఇండియాలోని ఆరో తరగతి నుంచి పదో తరగతికి చెందిన ‘ఇన్స్పైర్ అవార్డ్స్ – మనక్ పథకం’ కింద నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం తెరుచుకున్నదే ఈ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ) కార్యక్రమం. జిల్లా నుంచి ఇన్స్పైర్ మనక్ అవార్డుల కోసం 2020-21లో ఎంపికైన 132 మంది, 2021-22లో ఎంపికైన 106 మంది మాత్రమే వెబ్లింక్ (. buildingaieadiness.in/ ) ద్వారా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేసుకొని పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది.
మూడు ఫేస్లలో కార్యక్రమం..
కృత్రిమ మేధస్సు మూడు ఫేజ్లుగా నిర్వహిస్తున్నారు. మొదటి దశలో ‘ఇన్స్పైర్ అవార్డ్డ్ – మనక్ పథకం’ నోడల్ అధికారుల కోసం ఓరియంటేషన్ సెషన్లు జరుగనున్నాయి. ఇందుకోసం ఈ నెలాఖరులోపు వెబ్ పోర్టల్లో విద్యార్థులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న వారి కోసం లైవ్ స్టూడెంట్ ఓరియంటేషన్ సెషన్లు ఐడియాషన్ ప్రాసెస్తో సహా నిపుణులతో కోర్ ఏఐ కాన్సెప్ట్ల చుట్టూ నిర్వహించబడుతాయి. ఒక్కొక్కటి రెండు గంటల పాటు రెండు ప్రత్యక్ష, వర్సువల్ సెషన్లు నిర్వహించనున్నది. ఓరియంటేషన్ సెషన్లు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేయడం, ప్రతిపాదిత ఏఐ సాధించగలిగిన పరిష్కారాన్ని వివరిస్తూ 120 సెకన్ల వీడియో ద్వారా ఆలోచనల సమర్పణ, ఫేజ్ – 2 కోసం టాప్ 200 ఎంట్రీలను షార్ట్లిస్ట్ చేయడానికి నిపుణుల స్వతంత్ర కమిటీ ద్వారా మూల్యాంకనం ఉంటుంది. రెండో దశలో షార్ట్ లిస్ట్ చేయబడిన 200 మంది విద్యార్థులు డీప్ డ్రైవ్ కృత్రిమ మేధస్సు శిక్షణకు హాజరవుతారు. వీరికి నాలుగు వారాల బూట్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఇందులో 2 వారాల శిక్షణ, ఇంటెల్ ఏఐ ఫర్ యూత్ కోచ్లతో 2 వారాల వన్-వన్ మెంటరింగ్ సెషన్లు ఉంటాయి. అనంతరం విద్యార్థులు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధించగలిగిన ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తారు. తుది ఎంట్రీలను సమర్పిస్తారు. జ్యూరీ ద్వారా షార్ట్లిస్ట్ చేసిన పోస్ట్ మూల్యాంకనం పొందడానికి టాప్ 50 ప్రాజెక్టులు ఎంపికవుతాయి. మూడో దశ సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఇందులో ప్రాతినిథ్యం వహించే విద్యార్థులను విజేతలుగా ప్రకటించడంతో పాటు ఉత్తమమైనదాన్ని జాతీయ, అంతర్జాతీయ ప్లాట్ ఫారంలో ప్రదర్శిస్తారు.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
ఇన్స్పైర్ మనక్ అవార్డుల కోసం ఎంపికైన యువ ఆవిష్కర్తలు ఈ నెలాఖరులోగా వెబ్లింక్ ( http:// inspiremanak. buildingaieadiness.in ) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. బిల్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పూర్తిగా అవగాహన పొందాలి. ఇందుకోసం ఆయా పాఠశాలల హెచ్ఎంలు చొరవ తీసుకొని విద్యార్థులు పాల్గొనేలా చూడాలి. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు (98495 50200)ను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి, మంచిర్యాల