నిర్మల్ టౌన్/ఎదులాపురం, జనవరి 30 : రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించుకొని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే నెలలో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 1వరకు అన్ని జిల్లాల్లో అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటివరకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల సంఖ్య, విస్తీర్ణం, వచ్చిన దరఖాస్తులు, పరిశీలనలో ఉన్న దరఖాస్తుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని జిల్లాల్లో సబ్ కమిటీలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్వహించనున్న మన ఊరు-మనబడి పాఠశాలల ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, అటవీ భూముల సంరక్షణ, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆయిల్ఫాం సాగును ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో కలెక్టరేట్ సమీకృత భవనాలను వెంటనే పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమో షన్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నా యక్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, డీఈవోలు రవీందర్రెడ్డి, ప్రణీత, జిల్లా వైద్యాధికారులు ధన్రాజ్, నరేందర్ రాథోడ్, డీఎఫ్వో రాజశేఖర్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్,డీఆర్వో లోకేశ్వర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ అశోక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.