మంచిర్యాల ప్రతినిధి/కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్14 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్లోని బస్టాండ్ వద్ద అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్బాజ్పాయి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లుంబినీ దీక్ష భూమి ఫంక్షన్ హాలులో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పాటించాలని కోరారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారులు, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పెంచికల్పేట్ మండలం అగర్గూడ నుంచి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. డీజే పాటల నడుమ మహిళలు, యువకులు నృత్యాలు చేశారు. జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. పంచశీల జెండాలను ఆవిషరించారు. జైనూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనకయాదవరావు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు పాల్గొన్నారు. కాగజ్నగర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం నిరంతరం తపించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. సింగరేణి ఏరియాలోని గనులు, ఓసీపీలపై రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి జీఎం సంజీవరెడ్డి పూలమాల వేశారు. పంచశీల జెండాను ఆవిష్కరించారు. మందమర్రి పట్టణంలోని బీఆర్ఎస్ బీ1 కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జే రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్లు కట్చేసి పంపిణీ చేశారు. రామకృష్ణాపూర్ సీహెచ్పీ వద్ద జీఎస్ఆర్ ఫౌండేషన్ సాయంతో ఏర్పాటు చేసిన భీమ్ విగ్రహాన్ని ఏరియా జీఎం మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చెన్నూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ అర్చనాగిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్ పాల్గొన్నారు. పలుచోట్ల రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఆసిఫాబాద్ అంబేద్కర్ : పంచశీల జెండా ఎగురవేసి నమస్కరిస్తున్న అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హైదరాబాద్ తరలిన ప్రజాప్రతినిధులు, అధికారులు
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 125 అడుగులు కాంస్య విగ్రహావిష్కరణకు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివెళ్లారు. ఆయా మండలాల ఎంపీడీవోల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్లారు. దారి పొడవునా జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విప్ బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో పాటు నాయకులు, అధికారులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.