నిర్మల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో అధునాతన హంగులతో అంబేద్కర్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారమే మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. కాగా.. ఎకరం స్థలంలో నిర్మించిన ఈ భవనం.. ఒకేసారి 2వేల మంది కూర్చోవడానికి అనుకూలంగా బాల్కనీ, పెద్ద హాలుతో సమావేశ మందిరాన్ని నిర్మించారు. హాలుకు ఇరువైపులా సమాంతరంగా 15 అడుగుల వెడల్పుతో రెండు ప్యాసేజ్లను ఏర్పాటు చేశారు. ప్రధాన హాలులో కార్యక్రమాల నిర్వహణ కోసం భారీ వేదికను అందంగా తీర్చిదిద్దారు. వీటితోపాటు పది గదులు, పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా మరుగుదొడ్లను నిర్మించారు. రూ.30 లక్షలతో ఏయిర్ కూలింగ్ సిస్టం, వెలుతురు కోసం రూ.7 లక్షలు వెచ్చించి పైకప్పులో 14 చోట్ల పాలికార్బొనేట్ షీట్లను ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో సువిశాలంగా హాలు నిర్మించగా.. వీక్షించేందుకు బాల్కనీ కనువిందు చేస్తున్నది. కార్పొరేట్ హంగులతో చూపరులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా నిర్మించారు.
నిర్మల్ జిల్లాలో అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు రెండు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారు. 2002 సంవత్సరంలో అప్పటి ఆర్డీవో కార్యాలయం ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో 17 రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి ఎంపీ వేణుగోపాలాచారి ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగికి తెలిపి ఆయన ప్రత్యేక నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేయించారు. ఈద్గాం వెళ్లే రోడ్డు పక్కన సర్ద్ మహల్ ఎదురుగా ఉన్న రెవెన్యూ అధికారుల నివాస భవనం స్థానంలో నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ చేశారు. అరకొర నిధులతో భవన నిర్మాణ పనులు ఏళ్లుగా పునాదులకే పరిమితమయ్యాయి. భవన నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో 2017లో నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణచాంద నుంచి నిర్మల్ వరకు 1000 మందితో పాదయాత్ర నిర్వహించారు. దీంతో స్పందించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి రూ.5 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో అంబేద్కర్ భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబై అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితోనే అంబేద్కర్ భవన్ పూర్తయింది. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి కావడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ భవన నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక పోరాటాలు చేశాం.
– డీ రాములు, ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు
దళితుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కృషితో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అంబేద్కర్ భవనం నిర్మించారు. నిర్మల్లో 20శాతానికి పైగా దళితులు ఉన్నారు. వీరికోసం ఇక్కడ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఇటీవల ప్రారంభోత్సవానికి నిర్మల్కు వచ్చిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు వినతిపత్రం అందజేశాం. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.
– కే రాజలింగం, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక లీగల్ అడ్వయిజర్