ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’తో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా వందలాది పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దింది. తాజాగా ‘పీఎంశ్రీ’ కింద ఉమ్మడి జిల్లాలో 65 బడులను ఎంపిక చేయగా, ఒక్కోదానికి రూ. 2 కోట్లు కేటాయించనున్నది. ఏడాదికి రూ. 40 లక్షల చొప్పున ఐదేళ్లపాటు నిధులు ఇవ్వనుండగా, ఆయా పాఠశాలలు సకల సౌకర్యాలతో సరికొత్త రూపుసంతరించుకోనున్నాయి. మరో మూడు విడుతల్లో మరిన్ని స్కూళ్లకూ అవకాశం కల్పించనుండగా, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందుబాటులోకి రానున్నది.
– మంచిర్యాల, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు బడులను ప్రగతిబాటన నడిపించి మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా వందలాది పాఠశాలలను కార్పొరేట్కు దీటు గా తీర్చిదిద్దిగా, తాజాగా పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా)తో మరింత మేలు చేకూరనున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 65 స్కూళ్లు ఎంపిక చేయగా, ఒక్కో పాఠశాలకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు కేటాయించనున్నది. ఐదేళ్లపాటు ఏడాదికి రూ. 40 లక్షల చొప్పున వచ్చే ఈ నిధులతో బడుల అభివృద్ధికి వెచ్చించనున్నది. దీంతో ఆయా పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో పాటు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య అందనున్నది.
పది అంశాలే ప్రతిపాదికగా..
పది అంశాలను ప్రతిపాదికగా తీసుకొని అధికారులు స్కూళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు. పాఠశాలలకు పక్కా భవనం, బిల్డింగ్ సేప్టీ నామ్స్కు అనుగుణంగా ఉండాలి, ఫైర్ సేప్టీమేజర్మెంట్స్ తీసుకోవాలి, స్టేట్ యావరేజ్ ఎన్రోల్మెంట్ కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్(విద్యార్థుల చేరిక) ఉండాలి, బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక తాగునీటి సదుపాయం కలిగి ఉండాలి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హ్యాండ్ వాష్ చేసుకునే సదుపాయం ఉండాలి, ఉపాధ్యాయులు ఫొటో ఐడీ కార్డులు కలిగి ఉండాలి, పాఠశాలలో విద్యుత్ సదుపాయం వర్కింగ్ కండీషన్లో ఉండాలి. లైబ్రరీతో పాటు స్పోర్ట్స్ సదుపాయాలు ఉండాలి. ఇలా పది అంశాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను ఫైనల్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 5,978 బెంచ్ మార్క్స్ స్కూల్స్ను ఎంపకి చేసి.. దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలా మూడు దశల్లో వచ్చిన దరఖాస్తులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు పరిగణలోకి తీసుకొని జిల్లాకు కొన్ని పాఠశాలల చొప్పున ఎంపిక చేశారు.
జిల్లాల వారీగా ఇలా…
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 16 పాఠశాలలు ఎంపిక అయ్యాయి. వీటిలో జడ్పీహెచ్ఎస్ ఇంద్రవెల్లి-బీ, బేల, యాపల్గూడ, ఇచ్చోడ, తలమడుగు, కప్పర్ల, విద్యానగర్ హైస్కూల్, గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాల లకంపూర్, ఉట్నూర్, నిపని అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎంపీపీఎస్ దీపాయ్గూడ, టీఎస్ఎంఎస్ నార్నూర్, ఎంపీపీఎస్ సిరికొండ, టీఎస్ఎంఎస్ బజార్హత్నూర్, బోథ్, గుడిహత్నూర్ ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 19 పాఠశాలలు ఎంపికయ్యాయి. చెన్నూర్ ప్రభుత్వ హైస్కూల్, జెండా వెంకటాపూర్, సుద్దాల ఎంపీపీఎస్, టేకుమట్ల ఎంపీయూపీఎస్, టీఎస్ఎంఎస్ మంచిర్యాల, కాసిపేట, మందమర్రి, టీఎస్ఆర్ఈఐఎస్ (బాయ్స్)తాళ్లగురిజాల రోడ్, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (గర్ల్స్) లక్షెట్టిపేట, బెల్లంపల్లి (బాయ్స్), జడ్పీహెచ్ఎస్ జన్నారం(గర్ల్స్), అవడం, భీమారం, దండేపల్లి, దేవల్వాడ, దొనబండ, నెన్నెల, రేచిని, తీగల్పహడ్ ఉన్నాయి. ఇక నిర్మల్ జిల్లాలో 17 స్కూళ్లు ఎంపికయ్యాయి.
టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ముథోల్(బాయ్స్), సారంగాపూర్ జామ్(గర్ల్స్), జేసీ లెఫ్ట్ పోచంపాడ్, నచ్చనెల్లాపూర్, జుమ్మేరాత్పేట్ హై స్కూల్, టీబ్ల్యూ ఆశ్రమ పాఠశాల ఈద్గాం, ఓవైసీ నగర్, కుభీర్(యూపీఎస్), జడ్పీహెచ్ఎస్ తానూర్, బాసర, దిలావర్పూర్, మస్కాపూర్, టీఎస్ఎంఎస్ కుంటాల, దేగాం, లక్ష్మణ్చాంద, కోరిటికల్, కేజీబీవీ దస్తురాబాద్ ఎంపికయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13 పాఠశాలలు ఎంపిక చేశారు. టీఎస్ఎంఎస్ ఆసిఫాబాద్, సిర్పూర్(యూ), జడ్పీహెచ్ఎస్ బాబాసాగర్, చిన్నరాస్పల్లి, పెంచికల్పేట్, సిర్పూర్(టీ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల నజ్రుల్నగర్ విలేజ్ నెంబర్-3, ఎంపీపీఎస్ సాలుగుపల్లి, సావర్ఖేడ్, ఎంపీయూపీఎస్ బందల్హెట్టి, కాగజ్నగర్ తెలుగు, ఉర్దూ మీడియం ఓల్డ్ హై స్కూల్, కేజీబీవీ వాంకిడి ఎంపికయ్యాయి.
కొత్త ఆవిష్కరణలకే 40 శాతం నిధులు
ఈ పథకం ద్వారా వచ్చే నిధుల్లో 40 శాతం కొత్త ఆవిష్కరణలకే కేటాయించాలనేది నిబంధన. ఇప్పటి కే అన్ని మౌలిక వసతులు, సదుపాయాలున్న స్కూళ్ల నే ఇందుకు ఎంపిక చేశారు. ఇది తొలి విడుత మాత్రమే. ఇంకో మూడు విడతల్లో మరిన్ని పాఠశాల లను ఎంపిక చేస్తారు. రానున్న రెండేళ్లలో ఏడాదికి రెండుసార్లు పాఠశాలల లిస్ట్ ఫైనల్ చేస్తారు. ఇప్పుడు ఎంపికైన స్కూళ్లలో ఏ పనులు చేయాలనే అంశాల పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి ప్రతిపాదనలు పంపిస్తాం.
– వెంకటేశ్వర్లు, డీఈవో, మంచిర్యాల