తాంసి, జూలై 29 : రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమేనని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని చెబుతున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూస్వారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులు ఒకే రకమైన ఎరువులు వినియోగిస్తున్నారు. పత్తి విత్తకంటే ముందే ఎకరాకు మూడు, నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. వర్షాలధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో, లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులను ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తితో పాటు అన్ని వానకాలం పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో మూడు బస్తాల వరకు డీఏపీని చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలున్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది.
అధిక భాస్వరంతో నష్టం..
అధిక మొతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది. ప్రతి మొక్కకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉందని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం తెలియదు. ఉదాహరణకు 28-28-0 డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పొరపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడడం వల్ల భూసారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూసారం తగ్గి దిగుబడులు రావు, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారివేర్లు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది.
అవగాహన కల్పిస్తున్నాం..
ఎరువులు వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం. వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతే కాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం.
– రవీందర్, మండల వ్యవసాయ అధికారి, తాంసి