ఇచ్చోడ(సిరికొండ), మే 21 : తెలంగాణ వచ్చిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న జిల్లాలతో పాటు కొత్త మండలాలను సైతం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇచ్చోడ మండలం నుంచి పది గ్రామ పంచాయతీలు, ఇంద్రవెల్లి మండలం నుంచి 9 గ్రామ పంచాయతీల్లో మొత్తం 19 గ్రామపంచాయతీలతో పాటు 52 గ్రామాల్లో అధికంగా గిరిజనులుంటారు. కాగా, తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం సిరికొండ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మండలంలో ఎక్కువ మంది గిరిజనులు నివసిస్తారు. అయితే ఈ మండలంలో దవాఖాన లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా సమస్య వస్తే ఇంద్రవెల్లి, ఇచ్చోడ మండలాలకు, లేకపోతే జిల్లా కేంద్రంలోని రిమ్స్కు వెళ్లి వైద్యం చేసుకుంటున్నారు. దీంతో వారికి దూరభారంతో పాటు రవాణా ఖర్చులు భారమయ్యేవి. ఈ విషయమై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్కు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయమై విన్నవించారు. దీంతో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో గురువారం క్యాబినెట్ సమావేశంలో సిరికొండ మండలానికి పీహెచ్సీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆదివాసులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో మొత్తం 19 గ్రామపంచాయతీలుండగా, ఇందులో ఎక్కువ శాతం గిరిజన గ్రామ పంచాయతీలే ఉన్నాయి. సిరికొండలో పీహెచ్సీ ఏర్పాటు చేయడంతో వైద్య కష్టాలు తీరనున్నాయి. అందుబాటులో ప్రభుత్వ దవాఖాన లేకపోవడంతో వాయిపేట్, కుంటగూడ, ధర్మసాగర్, రిమ్మ, కన్నపూర్, ఫకీర్నాయక్ తండా, నారాయణపూర్ గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితిలో వైద్యం అందక మృతి చెందిన సందర్భాలు అనేకం. ఇప్పుడు పీహెచ్సీ ఏర్పాటు కావడంతో గిరిజనులకు వైద్యం అందుబాటులోకి రానున్నది.
తెలంగాణ ప్రభుత్వం సిరికొండ మండలానికి పీహెచ్సీ మంజూరు చేయడం ఆనందంగా ఉంది. మండలంలో ఇంకా జూనియర్ కళాశాల, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. వాటి మంజూరుకు నా వంతు కృషి చేస్తా. పీహెచ్సీ మంజూరు కావడంతో గిరిజనులకు వైద్యం అందుబాటులో ఉంటుంది. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నది.
– రాథోడ్ బాపురావ్, బోథ్ ఎమ్మెల్యే
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ మండలానికి పీహెచ్సీ మంజూరు చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పీహెచ్సీ ప్రకటించిన ముఖ్యమంత్రి, మంత్రి హరీశ్రావ్కు కృతజ్ఞతలు. పీహెచ్సీ ఏర్పాటుతో గిరిజనులు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలంలో అభివృద్ధి పనులు చేపట్టాలి.
– కందం శకుంతలాబాయి,సర్పంచ్, సోంపల్లి
మాది మారుమూల గ్రామం నిజాంగూడ. అత్యవసర పరిస్థితుల్లో గ్రామంలో ఎవరికైనా రోగం వస్తే ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్కు పోతుండేవాళ్లం. ఆర్థికభారంతోపాటు రోగి కూడా ఇబ్బందులకు గురయ్యేవాడు. సిరికొండలో ప్రభుత్వం దవాఖాన ఏర్పాటు చేయనుండడం సంతోషంగా ఉంది. దీంతో మా వైద్య కష్టాలు తీరుతాయి. ప్రభుత్వానికి గిరిజనుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– కనక దుందేరావ్