జిల్లా పోలీస్ అధికారుల సమీక్షలో ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఎదులాపురం, జూన్ 10 : జాతీయ లోక్ అదాలత్(ఈ నెల 26వ తేదీ)ను పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో శుక్రవారం ఆదిలాబాద్ సబ్ డివిజన్కు సంబంధించిన 12 పోలీస్స్టేషన్ల, సర్కిళ్ల సీఐలు, డీఎస్పీ, అదనపు ఎస్పీలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతమొందించే దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. జిల్లాలో ప్రతిఒక్క పోలీస్స్టేషన్లో రిసెప్షన్ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని, సరైన పద్ధతిలో నిర్వహించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలోని వర్టికల్స్కు డీఎస్పీస్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించిన ట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, స్థితిగతులను తెలుసుకొని తగు సూచనలు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, డీఎస్పీలు ఉమేందర్, టీ నారాయణ, సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, కే మల్లేశ్, బీ రఘుపతి, మల్లేశ్, గుణవంతరావు, ఎస్ఐలు, డీసీఆర్బీ, ఐటీకోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.