ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఎదులాపురం, జూన్ 15: ఆరు నెలలు కష్టపడితే ప్రభుత్వ ఉదోగ్యం సాధించవచ్చని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ డీటీసీ (జిల్లా శిక్షణ కేంద్రం)లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో ఎస్సీఅభ్యర్థులకు ఇస్తున్న శిక్షణను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఆరు నెలలు కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చని, 60 ఏళ్ల వరకు ఆనందంగా గడపవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయన్నారు.
వీటన్నింటికీ సరైన సమయం ఇదేనని, కష్టపడి చదివిన వారికి ఏదైనా ఒక ఉద్యోగం కచ్చితంగా వస్తుందన్నారు. ప్రతి సబ్జెక్టులోని అంశాన్ని క్లుప్తంగా తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ చరిత్రలోని కొన్ని అంశాలను సవివరంగా విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. శిక్షణ కేంద్రం ఆర్ఐ జీ వేణు, ఎస్ఐ రామస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.