ఆదిలాబాద్ బల్దియాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం పుర ప్రజావాణి పేరిట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. చైర్మన్తోపాటు కమిషనర్, వివిధ విభాగాల అధికారులు కూడా హాజరవుతారు. దరఖాస్తుదారులు సూచించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి.. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా పట్టణవాసులకు సత్వర పరిష్కారంతోపాటు పారదర్శకమైన సేవలు అందుతాయని అధికారులు అంటున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూడు గంటల పాటు కొనసాగుతుంది.
ఆదిలాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పట్టణాల్లో నివసించే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేస్తూ పరిశుభ్రత, పచ్చదనం నెలకొల్పడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నది. సర్కారు తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా 2.80 లక్షల జనాభా ఉంది. గతంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా వాటి సంఖ్య 49కి పెరిగాయి. పట్టణ పరిధి విస్తరిం చడంతో జనాభా కూడా పెరిగింది.మున్సిపాలిటీ పరిధి 70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మున్సిపాలిటీ పరిధిలో నివసించే ప్రజలు ప్రభుత్వం 19 రకాల సేవలను అందిస్తుంది. బర్త్, డెత్, సర్టిఫికెట్లు, రోడ్లు, మురుగు కాల్వలు, వంతెనలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, ఇండ్ల నిర్మాణాలు, ఆస్తి పన్ను చెల్లింపు, చిరు వ్యాపారులకు లైసెన్సులు, లే అవుట్ల అనుమతులు, వాణిజ్య ప్రకటనలు, సుందరీకరణ, ఇతర పనులు బల్దియా పరిధిలోకి వస్తాయి. పట్టణాలను అభివృద్ధి పర్చడంలో భాగంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నది. బల్దియా పరిధిలోని పలు వార్డుల్లో ప్రధాన, అంతర్గత రోడ్ల నిర్మాణం, కూడళ్ల అభివృద్ధి, పచ్చదనం కారణంగా ఆదిలాబాద్ పట్టణంలో సుందరీకరణ నెలకొంది.
సమస్యల పరిష్కారానికి పుర ప్రజావాణి
బల్దియా పరిధిలోని ప్రజలు తమ అవసరాలు, సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయానికి వస్తుంటారు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించడానికి ఆన్లైన్ విధా నం అమలు చేస్తుంది. ప్రజలు మీ సేవ కేంద్రాల్లో తమ పనుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. అవసరాల కోసం కార్యాలయానికి వచ్చిన వారికి కొన్ని సమయాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులోకి ఉండకపోవడంతో వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. పట్టణ పరిధిలోని నివసించే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తో పాటు సత్వర సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ చైర్మన్, అధికారుల వినూత్న కార్యక్రమం చేపట్టారు. పుర ప్రజావాణి పేరిట ప్రతి మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజల నుంచి దరఖాస్తలు స్వీకరిస్తారు. నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుంది. బల్దియా కమిషనర్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరవుతారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి అర్జీదారుకు రశీదు ఇస్తారు. వారంలోగా సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటారు. దరఖాస్తు దారుకు అతని సమస్య కు సంబధించిన వివరాలను ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. దీని ద్వారా ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందనున్నాయి.
ప్రజలు వినియోగించుకోవాలి
ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇందుకోసం ఆన్లైన్ విధానం అమలు చేస్తున్నాం. పలు కారణాలతో సేవల్లో జాప్యం కొంత జాప్యమవుతున్నది. చైర్మన్ సూచనల మేరకు ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారానికి పుర ప్రజావాణిని ప్రతి మంగళవారం నిర్వహిస్తాం. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి వారంలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. పట్టణ ప్రజలు ఈ కార్యక్రమ్నాని సద్వినియోగం చేసుకోవాలి.
– శైలజ, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్