ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో 33 వైద్య బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల ఈ క్యాంపులకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ, నేత్ర పరీక్షలు చేయించుకుం టున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,69,652 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన వారికి అద్దాలను అందజేస్తూ, మరికొందరిని శస్త్రచికిత్సలకు రెఫర్ చేస్తున్నారు. పేదల కండ్లలో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుండగా, తమ కంటి సమస్యలు పరిష్కారమవుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో అధికారులు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖ అధికారులు 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 6, గ్రామాల్లో 26 శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారు. అధికారులు శిబిరాల వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో రోజూ 200 నుంచి 300 మంది వరకు పరీక్షలు చేస్తున్నారు. రోజూ 4000 నుంచి 4500 మంది వరకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కలెక్టర్, వైద్యాధికారులు శిబిరాలను సందర్శిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
2,69,652 మందికి పరీక్షలు
జిల్లాలో శుక్రవారం వరకు కంటి వెలుగు కార్యక్రమం 63 రోజులుగా కొనసాగుతున్నది. జిల్లాలో 31 వైద్య బృందాలు విడుతల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 2,69,652 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. వీరిలో 32,644 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. పరీక్షల్లో భాగంగా 24,723 ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమయ్యాయి. అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు మందులు ఇస్తున్నారు. ఎలాంటి అద్దాలు వాడాలో వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలు ఖర్చులకు భయపడి పరీక్షలు చేయించుకోలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజలకు వరంగా మారింది. సర్కారు తమ కండ్లలో వెలుగులు నింపడానికి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కంటి సమస్యల నివారణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.