ఉమ్మడి రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడేవారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయరంగం అస్తవ్యస్తంగా మారింది. స్వరాష్ట్రం ఏర్పడడం, సీఎం కేసీఆర్ అయిన తర్వాత లాభసాటి అయింది. ప్రభుత్వం పథకాలను రైతులకు అందించడంలో వ్యవసాయశాఖ విశేష కృషి చేస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు మొదలుకొని పంటల కొనుగోళ్ల వరకు అధికారులు రైతులకు సేవలు అందిస్తున్నారు. రైతులకు వివిధ సేవలు అందించడంలో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ మొదటిస్థానంలో నిలిచింది. వివిధ అంశాల్లో వంద పాయింట్లకు జిల్లా 66.84 పాయింట్లు సాధించింది.
ఆదిలాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటివి రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. వ్యవసాయ రంగంలో అమలవుతున్న పథకాల కారణంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ ఏడాది వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 5.71లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఉన్నత చదువులు చదువుకుని కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు కూడా తమ సొంత గ్రామాలకు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోకుండా పంట ఉత్పత్తులను సర్కారు కొనుగోలు చేస్తున్నది. అధికంగా పత్తి సాగవుతున్నది. ఈ ఏడాది రైతులు నాలుగు లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేస్తున్నారు. గతేడాది పత్తి ధర రికార్డుస్థాయిలో పెరిగింది. క్వింటాళ్కు రూ.14 వేలు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఈ ఏడాది పత్తిని అధికంగా సాగు చేస్తున్నారు.
వ్యవసాయ సేవలు భేష్..
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందేలా చూస్తున్నారు. వానకాలం, యాసంగి సీజన్లలో విత్తనాల పంపిణీ మొదలుకొని కొనుగోళ్ల వరకు సేవలు అందిస్తున్నారు. జిల్లాలో 101 వ్యవసాయ క్లస్టర్స్ ఉండగా రైతులు అధికారులు, సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారు. రైతులకు వివిధ సేవలు అందించడంలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. మొత్తం 100 పాయింట్లకు ఆదిలాబాద్ 66.84 పాయింట్లు సాధించింది. క్రాప్ బుకింగ్లో 40 పాయింట్లకు 16.98 పాయిట్లు, ఆధార్ అనుసంధానంలో 30 పాయింట్లకు 23.39 పాయింట్లు, రైతుబీమా అమలులో 30 పాయింట్లకు 26.47 పాయింట్లను ఆదిలాబాద్ వ్యవసాయశాఖ సాధించింది. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుబీమా, వానకాలంలో రైతులు ఎన్ని ఎకరాల్లో, ఏఏ పంటలు సాగు చేస్తున్నారో పరిశీలించారు. క్రాప్ బుకింగ్, పీఎం కిసాన్ పథకం అమలులో భాగంగా పట్టా దారు పాసుపుస్తకం, ఆధార్ అనుసంధానం కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు.
ప్రభుత్వం పథకాలతో ప్రయోజనం..
వ్యవసాయరంగాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించడంతోపాటు పంటలు సాగులో సలహాలు, సూచనలు అందిస్తున్నాం. పథకాలను రైతులకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. వివిధ అంశాల్లో రైతులకు సేవలు అందించినందుకు ఆదిలాబాద్ జిల్లా మొదటిస్థానంలో నిలువడం సంతోషంగా ఉంది.
– పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి