రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం, సంరక్షణ చర్యలతో అటవీ విస్తీర్ణం పెరుగుతున్నది. సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో స్మగ్లర్ల వేటుకు పలుచబడ్డ అడువులు.. నేడు దట్టంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అడవుల విస్తీర్ణాన్ని లెక్కించగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు స్థానాలు దక్కాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా (6.04 లక్షల ఎకరాలు)కు మూడోస్థానం, మంచిర్యాల(4.36 లక్షల ఎకరాలు)కు ఐదోస్థానం, ఆదిలాబాద్(4.26 లక్షల ఎకరాలు)కు ఆరోస్థానం, నిర్మల్(3 లక్షల ఎకరాలు)కు తొమ్మిదో స్థానంలో నిలిచింది. సీఎం కేసీఆర్ కృషితో అడవులకు పూర్వ వైభవం వస్తుండగా, పర్యావరణ ప్రేమికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. – నిర్మల్ టౌన్, అక్టోబర్ 12
నిర్మల్టౌన్, అక్టోబర్ 12 : ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లాగా పేరుగాంచింది. సమైక్యాంధ్ర పాలనలో అడవుల సంరక్షణ అంతంత మాత్రంగానే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడవుల సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలను కఠినతరం చేసింది. హరితహారంలో భాగంగా 23 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అడవుల విస్తీర్ణాన్ని లెక్కించగా, ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలకు టాప్ 10 ర్యాంకులు దక్కాయి. 6.04 లక్షల ఎకరాల అటవీ ప్రాంతంతో కుమ్రం భీం జిల్లాకు రాష్ట్రస్థాయిలో మూడోస్థానం దక్కగా.. 4.36 లక్షల ఎకరాలతో మంచిర్యాలకు ఐదోస్థానం, 4.26 లక్షల ఎకరాలతో ఆదిలాబాద్కు ఆరోస్థానం, 3 లక్షల ఎకరాలతో నిర్మల్కు 9వ స్థానం దక్కింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 4173 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, అందులో 17.66 లక్షల ఎకరాల అడవి ఉన్నట్లు అటవీశాఖ అధికారుల లెక్కల్లో తేలింది. 24.07 లక్షల ఎకరాల్లో మిగిలిన భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమిలో 19 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైనవి కాగా, మిగతా 5 లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేని భూములుగా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో 10.26 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నది. అందులో 4.26 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా, 41.52 శాతంగా గుర్తించారు. నిర్మల్ జిల్లాలో 9.50 లక్షల ఎకరాలకుగాను 3 లక్షల ఎకరాలు (31.57 శాతం), ఆసిఫాబాద్ జిల్లాలో 12.05 లక్షల ఎకరాలకు 6.04 లక్షల ఎకరాలు (50.12శాతం), మంచిర్యాల 9.92 లక్షల ఎకరాలకుగాను 4.36 లక్షల ఎకరాలు (51.56శాతం) అటవీ విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అడవుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి చట్టాలను కఠినతరం చేసింది. వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, కందకాలు ఏర్పాటు చేయడం, చెక్డ్యాంలు నిర్మించడం, మైదాన ప్రాంతాల్లో సామూహిక అడవుల పెంపకాన్ని చేపట్టడంవంటివి చేపడుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులకు అరుదైన ఘనత దక్కింది. అడవులు ఎక్కువగా ఉండడంతో రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం కూడా యేటా రికార్డుస్థాయిలో కురుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాధారణ వర్షపాతం 1104మి.మీటర్లు కాగా, ఇప్పటివరకు 1500మి.మీటర్లకు పైగా వర్షపాతం కురవడానికి అడవులే కారణమని చెప్పక తప్పదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 శాతం రైతులు వర్షాధార పంటలను పండిసున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వర్షాలు కురవడంతో పంటల సాగుకు ఇబ్బంది లేదు. జిల్లాలో 19 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలుండగా.. అన్ని నియోజకవర్గాల్లో అటవీ విస్తీర్ణం గణనీయంగా ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేల్చారు. సిర్పూర్ నియోజకవర్గంలో 2.56 లక్షల ఎకరాల అడవి ఉండగా.. చెన్నూర్లో 1.56, బెల్లంపల్లిలో 1.69, మంచిర్యాలలో 0.58, ఆసిఫాబాద్లో 4.10, ఖానాపూర్లో 3.52, బోథ్లో 2.0, నిర్మల్లో 0.80, ముథోల్లో 0.23, ఆదిలాబాద్లో 0.58లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్ని నియోజకవర్గాల్లో సాధారణ విస్తీర్ణంతో పోల్చితే అటవీ విస్తీర్ణం 30 నుంచి 50శాతం వరకు ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాలకు రాష్ట్రంలోనే అరుదైన ఘనత దక్కడంపై జిల్లా రైతులు, పర్యావరణ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు అటవీ భూములపై ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిఘా పెట్టకపోవడంతో అడవులను నరికి వేలాది ఎకరాలు రైతులు సాగు చేసుకునేవారు. జిల్లాలోని కడెం, ఖానాపూర్, బోథ్, ఉట్నూర్, సిర్పూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నార్నూర్, కెరిమెరి, వాంకిడి, రెబ్బెన తదితర ప్రాంతాల్లో గుట్టపక్క ఉన్న రైతులు యేటా సాగు కోసం దున్ని పంటలు వేసుకునేవారు. అడవుల్లో జీవరాశుల వేట కూడా అధికంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడవులు అంతరించిపోకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో కఠినమైన చట్టాలను తీసుకొచ్చింది. అడవుల్లో లభించే కలప తరలిపోకుండా పెద్ద ఎత్తున ఫారెస్టు సిబ్బందిని నియమించి బేస్క్యాంపులను ఏర్పాటు చేసి అటవీ సంరక్షణ కమిటీలను ఏర్పాటుచేసి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడవుల్లో వన్యప్రాణులను వేటాడేవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. కలప స్మగ్లర్లను గుర్తించి పీడీయాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా అటవీ భూములు ఆక్రమించుకోకుండా అడవుల చుట్టూ కందకాలను తవ్వించింది. మరోపక్క తెలంగాణ హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగి రాష్ట్రంలోనే మంచి స్థానంలో నిలిచాయి.