బాసర, అక్టోబరు 12 : బాసర సరస్వతీ క్షేత్రం మూల నక్షత్ర పూజలతో సందడిగా మారింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆరోరోజు సరస్వతీ అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిచ్చారు. భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో సుహాసిని, మూలనక్షత్ర, మంత్రపుష్పం తదితర పూజలను నిర్వహించారు.
మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీ అమ్మవారికి మంత్రి ఐకేరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ విజయలక్ష్మి ఒడి బియ్యం, పట్టువస్ర్తాలను సమర్పించారు. బాసరకు చేరుకున్న మంత్రికి ఆలయాధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
అమ్మవారి మూల నక్షత్ర పూజల్లో పాల్గొన్న మంత్రి పట్టువస్ర్తాలను సమర్పించిన అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని అన్ని ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బాసర క్షేత్రంలో రూ. 8 కోట్లతో ఆలయ అతిథి గృహాలు నిర్మించి, ఐదు రోజుల క్రితం ప్రారంభించామన్నారు. మరో రూ.42కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే టెండర్లు పిలిచి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆలయ గర్భగుడి విస్తరణ, రాజగోపురాలు, ప్రాకార విస్తరణ, క్యూ కాంప్లెక్సులు, గోదావరి పుష్కర ఘాట్ వద్ద బాత్రూంలు, నది ఒడ్డున శివాలయం విస్తరణతో పాటు టీటీడీ వంద గదుల అతిథి గృహం, రెనోవేషన్ పనులు, రెండు లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ తదితర పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేసుకున్నవారు ఎందరో ఉన్నతస్థాయిలో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్రెడ్డి, బాశెట్టి రాజన్న, సర్పంచ్ లక్ష్మణ్రావు, టీఆర్మండలాధ్యక్షుడు శ్యాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బల్గం దేవేందర్, ఈవో వినోద్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గౌడ్, జుట్టు మల్లయ్య, మల్కన్న యాదవ్ తదితరులు ఉన్నారు.
సరస్వతీ అమ్మవారిని మంగళవారం మాజీ మంత్రి కడియం శ్రీహరి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్రావు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు స్వాగతం పలుకగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ సందీప్రావు కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం బాసర క్షేత్రాన్ని ఏడాదిలోనే అభివృద్ధి చేసిందని నిజామాబాద్ జడ్పీచైర్మన్ విఠల్రావు అన్నారు. టీఆర్ఎస్ యువ నాయకుడు నర్సూరి నరేశ్ భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.
మంగళవారం ఆలయంలో రూ. 1000 అక్షరాభ్యాసాలు 1518, రూ. 100 అక్షరాభ్యాసాలు 816, మొత్తం అక్షరాభ్యాసాలు 2334 జరిగినట్లు ఆలయాధికారులు తెలిపారు. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా అమ్మవారికి రూ. 18 లక్షల ఆదాయం సమకూరిందని, మొత్తం 20 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వినోద్రెడ్డి తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలతో అధిక లాభాలు గడించవచ్చని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దేగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి మంగళవారం సందర్శించారు. మంత్రిని ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రైతులకు పంటమార్పిడిపై సూచనలు, సలహాలు ఇచ్చారు. వాణిజ్య పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భైంసా మండలాధ్యక్షుడు భూమారెడ్డిని ఎమ్మెల్యే విఠల్రెడ్డి శాలువాతో సన్మానించారు. ఏఎంసీ చైర్మన్ పిప్పెర కృష్ణ, సర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బామ్ని రాజన్న, గణేశ్, చాకేటి లస్మన్న, సూర్యంరెడ్డి, రాము, రాంకిషన్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం వడ్యాల్లో ఆరోగ్య ఉపకేంద్రం, చామన్పెల్లిలో శ్రీరాములవారి ఆలయానికి భూమిపూజ నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ రఘునందన్రెడ్డి, మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి సురేందర్రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, వడ్యాల్ సర్పంచ్ అట్ల లలిత, చామన్పెల్లి సర్పంచ్ పడిగెల గంగాధర్, మండల ఉపాధ్యక్షురాలు కల్పనారాంరెడ్డి, చామన్పెల్లి ఎంపీటీసీ అనిత, నాయకుడు నరేశ్రెడ్డి, తహసీల్దార్ కవితారెడ్డి పాల్గొన్నారు.