ఆదిలాబాద్, జులై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా రు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో వర్ష నష్టంపై సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మ న్ నాందేవ్తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లోల మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, వరద నష్టంపై పూర్తి నివేదికలు తయారు చేయాలన్నారు.
నష్టపోయిన పంట వివరాలను పక్కాగా నమోదు చేయాలని, విరిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వివరాలు సేకరించాలని సూచించారు. చెరువులు, రహదారులు, పశు సంపద, ఇండ్లు లాంటి సమాచారం తీసుకొని కలెక్టర్కు అందజేయాలన్నారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణాల వల్ల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు జాగ్రత్త వహించాలని, పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించా రు. రహదారులు, వంతెనలు చెడిపోతే గ్రామ పం చాయతీ నిధులను వినియోగించి, మరమ్మతులు చేపట్టాలన్నారు. వర్షాల సమయంలో వివిధ శాఖ ల అధికారులు, సిబ్బంది, పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించారని మంత్రి ప్రశంసించారు. వానకాలం ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు నష్టం జరగకుండా చూడాలన్నారు. అనంతరం వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అధికారులు మంత్రికి వివరించారు.
గ్రామస్థాయి సిబ్బంది స్థానికంగా ఉండాలి..
వానకాలంలో రైతులకు పంట నష్టం జరుగకుండా, స్థానికులు ఇతర ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వివిధ శాఖల అధికారుల గ్రామాల్లోనే ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సరైన సలహాలు, సూచనలు అందజేసే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు కురిసినప్పుడు అధికారులు వంతెనలు పూర్తిగా పరిశీలించాలని సూచించారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. ఇచ్చోడ మండలంలోని రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏండ్లు గడచినా పనులు పూర్తికావడం లేదన్నారు. బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో రైతులు పంటలను ఎక్కువగా నష్టపోయారని, అధికారులు ప్రతి రైతూ వివరాలను సేకరించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు డేవిడ్, నటరాజన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.