ఆసిఫాబాద్, జూలై 21 : ప్రాణాంతక గుట్కా ప్యాకెట్లను ప్రభుత్వం నిషేధించింది. అయితే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వీటి విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతుండడం గమనార్హం. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి మహారాష్ట్ర మీదుగా కాగజ్నగర్కు గుట్కా దిగుమతి అవుతున్నది. లారీలు, ఆటోల ద్వారా ఈ దిగుమతులు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయి. ఇతర వస్తువుల దిగుమతి ముసుగులో ఈ గుట్కా ప్యాకెట్లు కాగజ్నగర్, ఆసిఫాబాద్కు తరలిస్తున్నట్లు వినికిడి. పెద్ద పెద్ద ప్యాకెట్ల రూపంలో ఇవి దిగుమతి అవుతున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్నగర్లోని బడా వ్యాపారులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ, గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినప్పటికీ ఈ దందాకు అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. కేసులు నమోదు చేసినా, మళ్లీ అదే దందాను కొందరు నిర్వహిస్తున్నారు.
కాగజ్నగర్ కేంద్రంగానే..
కాగజ్నగర్ సమీపంలోని ఇటుక బట్టీ వద్ద ఏర్పాటు చేసిన బంకర్లో ఇటీవల పెద్ద ఎత్తున గుట్కా లభ్యమైంది. ఏఎస్పీ బాలస్వామి, సీఐ, ఎస్ఐలు దాడులు నిర్వహించగా, రూ. 40 లక్షల విలువ చేసే గుట్కా బ్యాగులు లభ్యమైనట్లు రామగుండం సీపీ సత్యనారాయణ వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 127 గుట్కా కేసులు నమోదు కాగా, 147 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో లభ్యమైన రూ. 78 లక్షల 55 వేల 727 ల విలువైన గుట్కాను సీజ్ చేశారు. ఒక్క కాగజ్నగర్లోనే ఇంత పెద్ద మొత్తంలో గుట్కా లభ్యం కావడం బట్టి చూస్తే జిల్లాలో ఏ స్థాయిలో గుట్కా వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో గుట్కా వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నప్పటికీ, ఎందుకు అరికట్ట లేకపోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పట్టించుకోకపోతే ప్రాణాలకే ముప్పు
గుట్కా మహమ్మారి అత్యంత ప్రమాదకరం. దీని బారిన పడ్డ ఎందరో యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముఖ్యంగా విద్యార్థులు, కార్మికులు ఈ గుట్కాలకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ బారిన పడడంతో వారి కుటుంబాలు వీధిన పడిన సంఘటనలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం గుట్కాను నిషేధించింది. ఈ దందా కట్టడికి మరింత అప్రమత్తంగా అధికారులు కృషి చేయాల్సి ఉంది.
గుట్కా విక్రయిస్తే చర్యలు
గుట్కాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గుట్కా, నకిలీ విత్తనాల వ్యాపారంపై ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రజలు కూడా సహకరిస్తే గుట్కా వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో నివారించవచ్చు. గుట్కా వ్యాపారులపై కేసులు నమోదు చేసినా, కొందరు మళ్లీ అదే వ్యాపారం చేస్తున్నారు. అలాంటి వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం.