ఎదులాపురం, జనవరి 27 : ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాక్సిన్ పంపిణీ వివరాలను సేకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్, ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యాపల్గూడలో ఫీవర్ సర్వేను గురువారం పరిశీలించారు. సర్వే, వ్యాక్సిన్ పంపిణీపై ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. యాపల్గూడలో జనాభా, టీకా పంపిణీ, కొవిడ్ ఎక్స్గ్రేషియా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా టీమ్ వర్క్తో పని చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. జ్వరం సర్వేతో పాటు టీకా సర్వే నిర్వహించాలని ఆశ, ఏఎన్ఎం టీమ్లకు సూచించారు. అనంతరం యాపల్గూడలో గత సంవత్సరం నిర్మించిన పాంపాడ్ను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులపై ఆరా తీశారు. డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఐవో మెట్పెల్లివార్ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, సర్పంచ్ గంగారాం, ఎంపీడీవో శివవాల్, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.