ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యం లో ఓటే ఆయుధమని, ఓటర్గా నమోదైన వారందరూ నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం నిర్వహించిన 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరుగా నమోదైన వారందరూ తమ వివరాలను ఓటర్ లిస్టులో సరిచూసుకోవాలని తెలిపారు. 16, 17 సంవత్సరాల వయస్సున్న వారందరికీ ఎలక్టోరల్ విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఎస్ఆర్-2022లో పాల్గొన్న బూత్స్థాయి అధికారులు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల ఆధ్యాపకుల సహకారంతో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించామన్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని 14 మండలాల్లో ఉన్న 582 మంది బూత్స్థాయి అధికారుల సేవలను కలెక్టర్ కొనియాడారు. స్వీప్ నోడల్ అధికారి బీ లక్ష్మణ్ సేవలను ఎన్నికల కమిషన్ గుర్తించి రాష్ట్ర స్థాయి నగదు పురస్కారానికి ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్కు పురస్కారం అందజేశారు. కాగా.. ఉత్తమ అధికారిగా ఎంపిక చేసి అందించిన రూ.15 వేలను తాను పనిచేస్తున్న యాపల్గూడ ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇస్తున్నట్లు లక్ష్మణ్ ప్రకటించారు. అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, స్వీప్ కోర్ కమిటీ సభ్యులు ఎన్ భీమ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, పర్యవేక్షకులు వర్ణ, నలంద ప్రియా, స్వాతి, రాజేశ్వర్, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు.
ఓటుకు ఎంతో ప్రాధాన్యం
నిర్మల్ టౌన్, జనవరి 25 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉందని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కొత్త ఓటర్లతో కలిసి ఓటు ప్రాధాన్యతను తెలుపుతూ ప్రతిజ్ఞ చేయించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటుకున్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. భారత ఎన్నికల కమిషన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ శివప్రసాద్ పాల్గొన్నారు.