ఎదులాపురం, డిసెంబర్ 19 : రక్తహీనత ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వైద్య పరీక్షలు చేయించుకునే సమయంలోనే వైద్యులు గుర్తించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రోగులకు అందజేస్తున్న భోజనాలు, వంటశాల, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎన్ఆర్సీలో బరువు తక్కువతో వచ్చిన చిన్న పిల్లల కే షీట్లను పరిశీలించారు. వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారి బసపైపై ఆరాతీశారు. అక్కడి నుంచి ప్రసుతి వార్డులో బాలింతలతో మాట్లాడారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కే షీట్లను పరిశీలించారు. ఇందులో నలుగురు బాలింతలకు రక్తం తక్కువగా ఉండడంతో వైద్య పరీక్షల సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు.
కొందరు బరువు తక్కువగా జన్మించారని, వారిని ఎస్ఎన్సీయూలో ఉంచినట్లు వైద్యులు చెప్పారు. అనంతరం ఎన్ఎస్సీయూలో తక్కవ బరువు, ఇతర ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. పిల్లల ఆరోగ్యంపై ఆరాతీశారు. ఈ క్రమంలో ఎన్ఎస్సీయూ వార్డుకు వెళ్తుండగా, గేట్ ముందుర మెడికల్ వ్యర్థాలు ఉండంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిని పరమర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు. క్రమం తప్పకుండా గర్భిణులకు పీహెచ్సీ, రిమ్స్లో పరీక్షలు చేయించాలన్నారు. రిమ్స్కు వచ్చిన రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఎన్ఎస్సీయూ వార్డు శానిటేషన్పై నిర్లక్ష్యం చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ తదితరులున్నారు.
సైనికుడి భార్యకు రూ.3 లక్షల చెక్కు అందజేత
గుడిహత్నూర్ మండలం మన్నూర్కు చెందిన సైనికుడు జాదవ్ విజయ్ కుమార్ విధినిర్వహణలో మరణించాడు. దీంతో రాష్ట్ర సైనిక సంక్షేమ నిధి నుంచి రూ.3 లక్షల చెక్కును సైనికుడి భార్య రోహిణికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, డీవైఎస్వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.