ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 5 : జిల్లాలో శనివారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో గల ధర్మశాల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సరస్వతీ మాత పూజ నిర్వహించి చిన్నారులకు అక్షరాలు దిద్దించారు. అక్షరాభ్యాస మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పూజ సామగ్రి, బాసర సరస్వతీ అమ్మవారి వద్ద పూజ చేయించిన పలక, బలపం తదితర వాటిని సమితి ద్వారా కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, సనాతన హిందూ ఉత్సవ సమితి వ్యవస్థాపకుడు జగదీశ్ అగర్వాల్, బంజారా సేవా సమతి రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంనాయక్, సభ్యులు రాంకిషన్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఫిబ్రవరి 5 : మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రాథమిక పాఠశాలలో కమిటీ అధ్యక్షుడు నాగ్నాథ్, ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహించారు. వేదపండితుడు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు, గాయత్రీ యజ్ఞం నిర్వహించారు. బాసర సరస్వతీ అమ్మవారి వద్ద పూజ చేయించిన పలక, బలపం చిన్నారులకు అందజేసి అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణ, స్వప్న, అనసూయ, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, ఫిబ్రవరి 5 : మండల కేంద్రంలోని కుచులాపూర్ క్రాస్రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుడు సదానందశర్మ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. నాగభూషణం, విజ్ఞాన్ పాఠశాలలో విద్యార్థులు సరస్వతీదేవి చిత్రపటం వద్ద పూజలు చేశారు. కార్యక్రమాల్లో కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు గంగాధర్, రాజేందర్గౌడ్, కిశోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఫిబ్రవరి 5 : మండల కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్లో నిర్వహించిన వసంత పంచమి వేడుకలకు జడ్పీటీసీ జాదవ్ అనిల్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ఏలేటి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. సరస్వతీ అమ్మవారి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యురాలు మీన, ఆచార్యులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 5: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన విద్యను బోధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి టీచర్లకు సూచించారు. లక్కారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం సిబ్బంది ఈశ్వరీబాయిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పద్మ, సామాజిక సేవకురాలు మర్సుకోల సరస్వతి, సోంబాయి పాల్గొన్నారు.
బేల, ఫిబ్రవరి 5 : మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం-2లో సర్పంచ్ ఇంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం అక్షరాభ్యాసం, సీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేయించారు. గర్భిణులకు సీమంతం నిర్వహించి వారికి పండ్లు, గాజులు, చీరెలు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పద్మ, మంగళ, అనిత, సునీత పాల్గొన్నారు.