ఆదిలాబాద్, మే 17(నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో మట్టి, కంకర తేలిన రోడ్లు, అడుగడుగునా గుంతలు, వానొస్తే మోకాలి లోతు బురద, ఎండొస్తే దుమ్ముధూళి, కిలోమీటరు ప్రయాణించాలంటే గంటకు 20-30 వాహన స్పీడ్ దాటేది కాదు. స్వరాష్ట్రంలో రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోట్లాది రూపాయలు మంజూరు చేసి నిర్మించడంతో రోడ్లు దగ దగ మెరుస్తున్నాయి. గూడేల నుంచి జిల్లాకేంద్రాల వరకు రాకపోకలు అలసట లేకుండా సాఫీగా సాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య లేకుండా గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో వాహనదారులు ప్రయాణిస్తున్నారు. బ్రేకులు వేయకుండా, గేర్లు మార్చకుండా వెళ్తుండడంతో సమయంతోపాటు ఇం‘ధనం’ ఆదా అవుతున్నది. వాగులపై వంతెనల నిర్మాణంతో వానొచ్చినా, వరదొచ్చినా ఇబ్బందిలేకుండా మారింది. వివిధ రాష్ర్టాలకు సంబంధాలు మెరుగుపడి, వ్యాపార లావాదేవీల పురోగతికి మార్గం సుగమమైందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల పల్లెలతోపాటు గిరిజన గ్రామాలు, ఏజెన్సీ గూడేలు అధికంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండలాలు, జిల్లా కేంద్రానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వానకాలంలో చిన్నపాటి వర్షాలకు రోడ్లపై నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయేవి. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ అవసరాల కోసం మండల కేంద్రాలు, జిల్లా కేంద్రానికి రావాలంటే నరకయాతన అనుభవించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రహదారులు అభివృద్ధికి పకడ్బందీ చర్యలు చేపట్టింది. రూ.330 కోట్లతో ఒక వరుస రహదారులను రెండు వరుసల రహదారులుగా మార్చడం.. రూ.45 కోట్లతో 20 వంతెనల నిర్మాణాలు చేపట్టింది. దీంతోపాటు ఆదిలాబాద్ పాత జాతీయ రహదారికి రూ.40కోట్లు మంజూరు చేసింది. ఆదిలాబాద్ నుంచి బేల వరకు అంతర్జాతీయ రాష్ట్ర రహదారి నిర్మాణానికి రూ.55 కోట్లు వెచ్చించి 32 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రోడ్డుగా మార్చింది.
జైనథ్ మండలం నీరాల వద్ద ఉన్న లో లెవల్ కాజ్వే వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక్కడ బ్రిడ్జి నిర్మించడంతో బేల, జైనథ్ మండలాల ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు తప్పాయి.గిరిజన ప్రాంతాలకు మెరుగైన రవాణా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాలకు కూడా ప్రభుత్వం మెరుగైన రవాణా సౌకర్యం కల్పించింది. గుడి హత్నూర్ నుంచి ఉట్నూర్ వెళ్లే రహదారిని రూ.22 కోట్లతో రెండు వరుసల రహదారిగా మార్చింది దీంతోపాటు తాంసి, సుంకిడి, ఇచ్చోడ నుంచి బజార్హత్నూర్ వరకు తొమ్మిది కిలోమీటర్ల రహదారిని రెండు వరుసల రహదారిగా నిర్మించారు. ఆదిలాబాద్ పట్టణంలో 3.4 కిలోమీటర్ల డబుల్ రోడ్డును నాలుగు వరుసలుగా మార్చడంతోపాటు సోనాల, ఆదిలాబాద్ నుంచి బోథ్కు వెళ్లే రోడ్డును విస్తరించారు. అంతర్రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడంలో భాగంగా బోథ్ నుంచి మహారాష్ట్రలోని కిన్వట్ వరకు 16 కిలో మీటర్ల మేర రూ.36 కోట్లతో నిర్మించారు. తలమడుగు మండలంలోని సుంకిడి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు, నార్నూర్ నుంచి భీంపూర్ వరకు ఎనిమిది కిలోమీటర్లు, బేల నుంచి జైనథ్ వరకు మూడు కిలోమీటర్ల రోడ్డును డబుల్ లేన్గా మార్చారు.
రూ.45 కోట్లతో 20 వంతెనలు
వానకాలంలో వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు రోడ్లపై వంతెనలు లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. చిన్నపాటి వర్షాలకు వాగులు, వంకలు పొంగి రోడ్లపై నీరు ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. ఏజెన్సీ, మారుమూల గ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. వరద ప్రభావం తగ్గితేకాని ప్రజలు బయటకు రాని పరిస్థితులు ఉండేవి. వైద్యం కోసం పోదామంటే వాగులు దాటనిచ్చేవికావు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.45 కోట్లతో 20 వంతెనలు నిర్మించింది. దీంతో ప్రజలకు రాకపోకలు ఇబ్బందులు దూరమయ్యాయి. ఇప్పడు భారీ వర్షాల కురిసినా ఇబ్బందులు లేకుండా ప్రజలు తమ ప్రయాణాలు సాగిస్తున్నారు.
నాడు..
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాఠన్, కొబ్బయి రోడ్డు దుస్థితి. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 32 కిలోమీటర్లు ఎన్హెచ్ 975 ఉంది. బేల మండలంలోని 15 గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుండేవారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మండల ప్రజలు అవస్థలు పడేవారు. గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు దేవుడిపై భారం వేసి ప్రయాణించేవారు.
నేడు..
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్హెచ్ 975 రోడ్డుకు మోక్షం కలిగింది. జైనథ్ మండలంలోని భోరజ్ ఎక్స్రోడ్ నుంచి బేల మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు రూ. 47 కోట్లతో రెండు వరుసల రహదారిని సర్కారు నిర్మించింది. దీంతో ప్రజలు సాఫీగా రాకపోకలు సాగుస్తున్నారు. ఆటోలు, జీపులు, కార్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు దూసుకెళ్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి చంద్రాపూర్, బల్లర్షాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రజలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రయాణం సాగుస్తున్నారు.
రోడ్లు బాగైనయ్.. ప్రయాణం సులువైంది..
మా ఊరు బండల్నాగాపూర్ నుంచి ఆదిలాబాద్ టౌన్కు పోయిరావాలంటే నరకం కనిపించేది. పది కిలోమీటర్ల రోడ్డే గని గుంతలు పడి ఉండడంతో గంటన్నర టైం పట్టేది. బండంత పాడైపోయేది. ఒళ్లయితే హూనమయ్యేది. వానకాలం అయితే చాలా అవస్థలు పడేవాళ్లం. ఆరేండ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం డాంబర్ రోడ్డు వేయడంతో 30 నిమిషాల్లో పోయి వస్తున్నాం. ప్రయాణం కూడా ఎటువంటి అవస్థలు లేకుండా సాఫీగా సాగుతున్నది.
40 నిమిషాల్లో ఆదిలాబాద్కు పోతున్నాం..
గతంలో బేల నుంచి ఆదిలాబాద్కు వెళ్లాలంటే నరకం అనుభవించాల్సి వచ్చేది. రోడ్డు, బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రయాణం చేయాలంటే భయపడేటోళ్లం. వానకాలంలో వర్షాల కారణంగా రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. గర్భిణులు, వైద్యం కోసం ఆదిలాబాద్ దవాఖానకు పోయేటోళ్లు, విద్యార్థులు ఇబ్బందులు పడేవాళ్లు. ఆటోలు, బస్సులు నడిచేవి కావు. మోటార్ సైకిళ్లపై పడుతూ లేస్తూ పోవాల్సి వచ్చేది. పొద్దున బయలుదేరితే పగటిదాకా కూడా చేరుకునేవాళ్లం కాదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడేళ్ల కిందట ఆదిలాబాద్ నుంచి బేల వరకు డబుల్లేన్ రోడ్డు వేశారు. ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా రాకపోకలు సాగిస్తున్నాం. 40 నిమిషాల్లో ఆదిలాబాద్కు చేరుకుంటున్నాం. – అంకత్వార్ రాజు, డోప్తాల, బేల మండలం