‘నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సకల హంగులతో తీర్చిదిద్దాలి. ఆగస్టు 15వ తేదీలోగా పనులు పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభిస్తాం’ అని అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మాత్యులు అల్లోల ఇంద్ర కరణ్రెడ్డి పేర్కొన్నారు. పనులను మంత్రి సోమవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిర్మల్ అర్బన్, మే 16 : నిర్మల్ పట్టణంలో అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మిస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణ పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. ప నుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐడీవోసీ భవన నిర్మాణంలో భాగంగా ఉ ధ్యాన పనులు, అప్రోచ్ రోడ్డు, కాంపౌండ్ వాల్, ఆర్చ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించా రు. కార్యాలయ ఉద్యోగులకు, ఆయా పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు తదితర వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో పచ్చదనం కో సం మొక్కలు నాటాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా పనులను పూర్తిచేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.5 కోట్లతో ఆలయ అభివృద్ధి..
నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ కాలనీలో రూ.5 కోట్లతో మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 80 శాతం పనులు పూర్తయ్యాయని, కృష్ణ శిలలతో నిర్మిస్తున్నామన్నారు. ఆగస్టు వరకు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే రూ.35 లక్షలతో ఐదు చేతుల పోచమ్మ, రూ.35 లక్షలతో జంగల్ హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. మంత్రి వెంట కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నాయకులు పద్మాకర్, గంగాధర్ స్పెషల్ క్లాస్వన్ కాంట్రాక్టర్ లక్కాడి జగన్మెహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
శుభకార్యానికి హాజరైన మంత్రి..
మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మనవండ్ల పుట్టు పంచల శుభకార్యం స్థానిక సాగర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించగా మంత్రి అల్లోల కుటుంబ సమేతంగా హాజరయ్యారు. చిన్నారులను ఆశీర్వదించారు. ముథోల్ ఎమెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు అల్లోల గౌతం రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, మారుగొండ రాము కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
శిక్షణ శిబిరం సందర్శన..
ఐకేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని మంత్రి సందర్శించారు. నిరుద్యోగుల కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఆస్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ బాషలో నిర్వహించే టెట్ శిక్షణ తరగతుల కేంద్రాన్ని ప్రారంభించారు.