ఎదులాపురం, అక్టోబర్ 20 : శానసనభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని, అందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ శాంతినగర్లోని ఈవీఎం గోదాంను ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్తో కలిసి సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారులు, సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బంది సమక్షంలో ఆన్లైన్ విధానం ద్వారా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల కేటాయింపు ఫస్ట్ లెవెల్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికలలో వినియోగించాల్సి ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ల వివరాల గురించి సంబంధిత అధికారులకు దిశార్దేశం చేశారు. ఈ ర్యాండమైజేషన్లో అదనపు కలెక్టర్లు ఖుష్బుగుప్తా శ్యామలాదేవి, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మోహతో, ఆర్డీవో స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
పత్తి కొనుగోళ్లకు
ఎదులాపురం, అక్టోబర్ 20 : పత్తి కొనుగోళ్లను ప్రారంభించడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ను సందర్శించి పత్తి కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పత్తి పంటకు కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
పత్తి కొనుగోళ్ల ప్రారంభం దృష్ట్యా మార్కెట్ యార్డులలో తూకం మిషన్లను, తేమ కొలిచే యంత్రాలు, మౌలిక వసతులు, తదితర ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ట్రేడర్స్, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి వారి సూచనలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే కొనుగోళ్లును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ట్రేడర్లు, తదితరులు పాల్గొన్నారు.