ఎదులాపురం, సెప్టెంబర్ 13 : ఎస్సీ, గిరిజన రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా చేపడుతున్న పంటల సాగులో జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, గిరిజన రైతులకు ఆయిల్ పామ్ పంటలపై అవగాహన కల్పించి, సాగుకు ప్రోత్సహించాలన్నారు. అందు కు క్షేత్ర పర్యటనలు నిర్వహించాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి సంబంధించిన ప్రతిపాదనలు ఎక్కువగా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో పంటల సాగుపై ఉన్నతి కార్యక్రమం కింద యువరైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో పండ్ల తోటల పెంపకం, బింధు, తుంపర్ల సేద్యం, పామాయిల్ సాగు కింద చేపట్టే పథకాల అమలుకు కమిటీ తగు సూచనలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నటరాజ్, ట్రైనీ అదనపు కలెక్టర్ పీ శ్రీజ, డీఆర్డీవో కిషన్, నా బార్డ్ జీఎం తేజ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ సహాయ సంచాలకుడు రమేశ్, ఉద్యాన శాఖ అధికారులు, పామాయిల్ కంపెనీ మేనేజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై సమావేశం..
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మం దిరంలో అధికారులతో సిక్తా పట్నాయక్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్, పంచాయతీ, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల సహకారం తో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 1-19 ఏండ్ల పిల్లలు 1,88,312 మంది ఉన్నారని తెలిపారు. 15, 22వ తేదీల్లో మాత్రల ను అందజేయాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేం ద్రం, పాఠశాల, కళాశాలల్లోని విద్యార్థులకు త ప్పని సరిగా అందజేయాలని ఆదేశించారు. అవసరమైనన్ని మాత్రలను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలో 1256 అంగన్వాడీ కేంద్రాల్లో 48,727 మంది.., 1427 పాఠశాలల్లో 1,24,960 మంది.., 48 జూనియర్ కళాశాలల్లో 14,625 మంది.., బడిబయట 2,801 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన బ్యానర్ విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఐవో వైసీ శ్రీనివాస్, వైద్యులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.