ఆదిలాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. నిరుపేదలకు అన్నదానం, అనాథలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. చౌరస్తాలు, కూడళ్లు, పార్టీ కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులు, ఎక్కడ చూసినా ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని దీవెనలందించారు. ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో రైతులు, నార్నూర్ మండలం ఖైరదట్వాలో ఉపాధి కూలీలు కేక్ కట్ చేశారు. ఆయా చోట్ల నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్రెడ్డి, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులతో పాటు పలు సంఘాల నాయకులు నిర్వహించిన బర్త్డే వేడుకలతో వాడలన్నీ కళకళలాడాయి. ఎక్కడ చూసినా జై బీఆర్ఎస్.. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి. పలుచోట్ల చిత్రపటాలు, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. దవాఖానల్లో రోగులకు పండ్లు అందజేశారు. పేదలకు అన్నదానంతో పాటు చీరలు పంపిణీ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వందేళ్లు వర్ధిల్లాలని దీవెనలందించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 76 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ 14 ఏండ్ల పోరాటం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సాధించారనన్నారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో ని పంట పొలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ పథకాలతో తమ ఉపాధి బాగుపడిందని రైతులు తెలిపారు. నార్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేక్ కట్ చేశారు. ఖైరదట్వాగ్రామంలో ఉపాధి హామీ కూలీలు కేక్ కట్ చేసి, సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచి పెట్టారు.అనంతరం ప్రసూతి దవాఖానలో గర్భిణులు, బాలింతలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి కేక్ కట్ చేశారు. దేశంలోనే అత్యుత్తమ సీఎంగా కేసీఆర్ పేరు నిలిచిందని పేర్కొన్నారు.