ఎదులాపురం, సెప్టెంబర్ 20 : టీఎస్పీఎస్సీ (తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) గ్రూప్-1 పరీక్ష (అక్టోబర్ 16న)నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం సంబంధిత అధికారులతో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని 19 కేంద్రాల్లో మొత్తం 262 గదుల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా పరీక్షా కేంద్రాల ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడి, తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటుకు శుక్రవారం లోగా చర్యలు తీసుకుంటూ నివేదికలు సమర్పించాలన్నారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని పోలీసు అధికారులకు సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు బస్ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సుమారు 6,200 మంది అభ్యర్థుల పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. వసతులకు సంబంధించి ఆయా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, డీఈవో ప్రణీత, ఇన్చార్జి డీఆర్వో అరవింద్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు వర్ణ, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన పాల్గొన్నారు.
నిర్మల్లో కలెక్టర్..
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 20 : నిర్మల్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 20 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తంగా 4,493 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే తదితరులు పాల్గొన్నారు.