తాంసి, సెప్టెంబర్ 2 : ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారప్ అలీ ఫారూఖీ.. తాంసి, దస్తురాబాద్ మండలాల్లోని దవాఖానలు, పాఠశాలల్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్యం.., ఆహారంపై ఆరా తీశారు. తాంసి మండల కేంద్రంలోని పీహెచ్సీ, కేజీబీవీ, ఆశ్రమ, జడ్పీ పాఠశాలలను అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా, ట్రైనీ అదనపు కలెక్టర్ పీ శ్రీజతో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో కలెక్టర్ మా ట్లాడుతూ.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సంబంధిత వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రసవాలు, కొవిడ్ వ్యాక్సినేషన్, హైరిస్క్ ప్రసవాలపై సంబంధిత వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో లక్ష్యాలకు అనుగుణంగా ప్రసవాలు పొందేలా చూడాలని, ఆశకార్యక్తలు, ఏఎన్ఎంలు ప్రసవానికి ముందే గర్భిణులు దవాఖానకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సబ్సెంటర్ల వారీగా శిబిరాలు నిర్వహించి, ఈ నెల 15వ తేదీలోగా కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. అనంతరం కేజీబీవీ, జడ్పీ, ఆశ్రమ పాఠశాలల్లో బోధన తీరు, భోజనం, స్టోర్రూంలు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థుల హాజరుశాతం, స్టాక్ వివరాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. వసతులు, భోజనం, బోధన తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్నరత్నప్రకాశ్ కేజీబీవీలో ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. దీనిపై సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం బోడగుట్ట సమీపంలోని బృహత్ పార్కు, పొన్నారిలోని ఎవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు. బృహత్ ప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సర్పంచ్కు సూచించారు. అనంతరం గ్రామం నుంచి బోడగుట్టకు వెళ్లే దారి సరిగ్గాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్రాథోడ్, అదనపు డీఎంహెచ్వో శ్రీకాంత్, డీఈవో ప్రణీత, పంచాయతీరాజ్ ఈఈ మహావీర్, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీల్దార్ శ్రీదేవి, ఏవో రవీందర్, ఎంపీవో సుధీర్రెడ్డి, సర్పంచ్ స్వప్నరత్నప్రకాశ్, ఉప సర్పంచ్ సంతోష్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ అరుణ్కుమార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అలేఖ్య, హెచ్ఎంలు విలాస్, రాజేశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగన్న పాల్గొన్నారు.
దస్తురాబాద్లో నిర్మల్ కలెక్టర్..
దస్తురాబాద్, సెప్టెంబర్ 2 : మండల కేంద్రంలోని కేజీబీవీలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి నిర్మల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సాయంత్రం స్నాక్స్ తిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. బోధన, భోజనం, వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నా రు. స్నాక్స్, పాఠశాల ఆవరణను చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రీడల్లో గెలిపొందిన విద్యార్థులను అభినందించారు. కేజీబీవీ పాఠశాలకు ప్రహరీ లేదని, నిర్మించాలని ఎస్వో వీణ కలెక్టర్ను కోరారు. అలాగే కేజీబీవీ పాఠశాలకు నూతన రోడ్డును మంజూరు చేయాలని తహసీల్దార్ లక్ష్మి కోరాగా, ఎంపీడీవో వెంకటేశ్వర్లను ఆదేశించారు. అంతకుముందు మండలంలోని పెర్కపల్లె గ్రామంలో హెచ్పీ పెట్రోల్ బంక్ మంజూరు కాగా, స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో తుకారం, డీపీవో తిరుమల, ఎంపీవో అనిల్ కుమార్, పం చాయతీ రాజ్ ఏఈ లవకుమార్, ఆర్ఐ గంగన్న, పీవీ నర్సయ్య, డిప్యూటీ సర్వేయర్ సంధ్యారాణి, ఏపీఎం గంగాధర్, ఏపీవో రవిప్రసాద్, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.